(వీడియో) ప్రొద్దుటూరులో జగన్ పై పూలవర్షం..రోడ్డంతా పూలే
- వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రొద్దుటూరులో పూల వర్షం కురిసింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రొద్దుటూరులో పూల వర్షం కురిసింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ శనివారం ఐదోరోజు ప్రొద్దుటూరులోకి అడుగుపెట్టారు. కడప జిల్లా జగన్ సొంత జిల్లా కావటంతో పాటు ప్రొద్దుటూరులో వైసీపీ ఎంఎల్ఏ రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో జగన్ కు అఖండ స్వాగతం లభించింది.
ఊరిలోని అమ్మవారి వీధి మొత్తాన్ని పూలతో నింపేసారు. బంతిపూలు, చేమంతిపూల రేకులతో వీధిమొత్తాన్ని పరిచేసారు. సుమారు 5 వేల కిలోల పూలను ఎంఎల్ఏ ప్రసాద్ రెడ్డి, నేతలు సేకరించి వీధిలో పరిచారు. అంటే జగన్ పూలపైనే నడిచారు.
అదే విధంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ళు, షాపుల పై నుండి జగన్ పై పూలవర్షం కురిపించారు. జగన్ తో నడిచేందుకు వేలాదిమంది పార్టీ శ్రేణులు, స్ధానికులు పోటీలు పడ్డారు. తమ సమస్యలను వివరించేందుకు స్ధానికులు జగన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.