మారేడుమిల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి
తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం నాడు ఘోర ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి- చింతూరు మధ్య పర్యాటకులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
మారేడుమిల్లి- చింతూరు మధ్య పర్యాటకులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సునునడిపాడా ఇతర కారణాలతో ఈ ప్రమాదం చోటు చేసుకొందా అనే విషయమై ఇంకా స్పస్టత రావాల్సి ఉంది.
హైద్రాబాద్ నుండి భద్రాచలం మీదుగా మారేడుమిల్లి వద్ద బస్సు అదుపు తప్పింది. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బస్సులో ఇంకా ఎవరైనా చిక్కుకొన్నారా అనే కోణంలో కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. మంగళవారం నాడు భద్రాచలం వద్ద శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకొన్న తర్వాత మారేడుమిల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ఈ బస్సు లోయలో పడినట్టుగా ప్రాథమిక అందిన సమచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఈ బస్సు ప్రమాదంలో పలువురు గాయపడినట్టుగా సమాచారం అందింది. అయితే బస్సులో ఎంతమంది ఉన్నారు. ఎంతమంది చనిపోయారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత నెల 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం వద్ద గోదావరి నదిలో బోటు మునిగిన ప్రమాదంలో 58 మంది మృతి చెందారు. పాపికొండల యాత్రను నిషేధించడంతో పర్యాటకులు రోడ్డు మార్గంలో ఈ దిశగా ప్రయాణం చేస్తున్నారని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకొన్నా కూడ ప్రమాదాలు తగ్గడం లేదు. డ్రైౌవర్ల నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లు కూడ దెబ్బతిన్నాయి. మరోవైపు ఈ ప్రాంతానికి ఈ డ్రైవర్ కొత్త కావడంతో కూడ ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతం. అంతేకాదు ఘాట్ రోడ్డు కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ విషయం తెలిసిన వెంటనే తూర్పు గోదావరి జిల్లా అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోయలోపడిన వారిని బయలకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం రాజమండ్రితో పాటు రంపచోడవరం ఆసుపత్రులకు తరలించారు.