‘మంత్రి గంటా శ్రీనివాసరావును నమ్మి మోసపోయా’
ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే
మంత్రి గంటా శ్రీనివాసరావు తనను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఆరోపించారు. టీడీపీ నుంచి టిక్కెట్ ఖాయమని, చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి గంటా శ్రీనివాసరావు నమ్మించడంతో పార్టీలో చేరానని, తీరా టిక్కెట్ రాకపోవడంతో మోసపోయానని తన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు.
గాజువాకలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిక్కెట్ రాకపోవడంతో గంటా సమక్షంలో చంద్రబాబునాయుడు వద్ద మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుతో కలిసి తాను టిక్కెట్ విషయాన్ని ప్రస్తావించగా... టీడీపీలో చేరితే టిక్కెట్ ఇస్తానని తాను ఎటువంటి హామీ ఇవ్వలేదని స్వయంగా చంద్రబాబు చెప్పారన్నారు.
గంటా తమను మోసం చేశారని, ఈ విషయంలో చంద్రబాబు తప్పులేదని తెలుసుకున్నామని తెలిపారు. 2014లో గాజువాక నుంచి తనకు టిక్కెట్ ఖాయమని గంటా చెప్పడంతో వార్డుల్లో ప్రచారం కూడా చేశానన్నారు. టిక్కెట్ రాకపోవడంతో తన అనుచరులు ఇండిపెండింట్గా పోటీచేయాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆ దిశగా ముందుకెళ్లకుండా వారికి నచ్చజెప్పానని తెలిపారు.