ఎవరి కోసమో, ఎవరో అడిగారని ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు అందుకోరని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇటీవల అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీపైనా కొడాలి నాని స్పందించిన సంగతి తెలిసిందే. 

తెలుగుదేశం పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ అందుకోవాలంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసమో, ఎవరో అడిగారని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని కొడాలి నాని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కుప్పంలోనూ ఎదురుగాలి వీస్తోందన్నారు. చివరికి కుప్పంలో కూడా చంద్రబాబు పోరాడాల్సిన పరిస్ధితి వచ్చిందని కొడాలి నాని పేర్కొన్నారు. కుప్పంలోనూ చంద్రబాబు పీడ విరగడ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. జగన్ దెబ్బకు టీడీపీ, జనసేన, బీజేపీ కకావికలం కాకతప్పదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని.. చంద్రబాబు పార్టీ, పవన్ పార్టీ పొత్తు పెట్టుకుంటాయని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకుంటారన్న అర్ధంలో మాట్లాడారు కొడాలి నాని. రెండు పార్టీలను జగన్ చిత్తుచిత్తుగా ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు. 

ఇకపోతే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ల భేటీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వెనక మతలబు ఏమిటని..? సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ సాగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్‌ల భేటీలపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఉపయోగం లేకుంటే ఎవరితో నిమిషం కూడా మాట్లాడరని కొడాలి నాని అన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారని అన్నారు. 

Also REad:అమిత్ షాతో జూ. ఎన్టీఆర్ భేటీ: ఆంధ్ర సెటిలర్ల ఓట్లకు గాలం

జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపర్చుకోవడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని తాను భావిస్తున్నట్టుగా కొడాలి నాని చెప్పారు. ‘‘జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబట్టే.. దేశవ్యాప్తంగా ప్రచారం చేయించుకునే అవకాశం ఉందని కలిశారు. చంద్రబాబుతో ప్రయోజనం లేకపోవడంతోనే మోదీ, అమిత్ షాలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అన్నారు’’ అని కొడాలి నాని చెప్పారు.