ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీరణ తర్వాత మీడియాకు దూరమైన కొడాలి నాని చాలా రోజుల తర్వాత కనిపించారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి తనకు వెంట్రుకతో సమానమన్నారు.
తనను మాజీ మంత్రి అని పిలవవద్దని, గుడివాడ(Gudivada) ఎమ్మెల్యేగా ఉండటమే తనకు ఇష్టమన్నారు కొడాలి నాని(Kodali Nani) అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని బాపట్ల(Bapatla) ఎంపీ నందిగం సురేశ్ తో కలిసి ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. తనకు మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానమన్న ఆయన .. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
సీఎం జగన్తో కలిసి పనిచేయడమే తన ముఖ్య లక్ష్యమన్నారు . రాష్ట్రం శ్రీలంక అవుతుందని విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకపోయి ఉంటే ఇప్పటికే రాష్ట్రం తీవ్ర అవస్థల పాలయ్యేదని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ ను కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలైందని కొడాలి నాని ఆవేదన చెందారు. బాబు జగ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఊపిరున్నంతకాలం ప్రజా ప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తానని మాజీ మంత్రి చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ప్రభుత్వం చేస్తున్న మంచిని ఓర్చుకోలేక రాష్ట్రంలో తిరుగుతూ విషప్రచారం చేస్తున్నారని ఎంపీ నందిగం సురేశ్ (nandigam suresh) మండిపడ్డారు.
కాగా.. ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ (ap cabinet reshuffle) నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్గా అవకాశం కల్పించనున్నారు జగన్. కేబినెట్ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్గా మల్లాది విష్ణును నియమించిన సంగతి తెలిసిందే.
