చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన విషయంలో ఘోరమైన తప్పిదం చేశారని సూర్యారావు వ్యాఖ్యానించారు. 

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం సూర్యారావు మీడియాతో మాట్లాడుతూ.. నిబద్ధతతో పనిచేసిన తనను మెడబట్టుకుని గెంటేసినంత పనిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని సూర్యారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధలో వున్న తనను సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని.. వైసీపీ కోసం శాయశక్తుల పనిచేస్తానని గొల్లపల్లి సూర్యారావు స్పష్టం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టీడీపీ స్థాపించిన మొదటి రోజు నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. విలువలు, నైతికత, విశ్వసనీయతో పనిచేశానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తన విషయంలో ఘోరమైన తప్పిదం చేశారని సూర్యారావు వ్యాఖ్యానించారు. అమలాపురం పార్లమెంట్ ఇస్తానని చెప్పి తనను మోసం చేసి పండుల రవీంద్ర బాబుకు టికెట్ ఇచ్చారని ఆరోపించారు. ప్రతికూల పరిస్థితుల మధ్య టీడీపీలో కొనసాగుతూ వచ్చానని.. తాను టీడీపీలో సీనియర్ దళిత నాయకుడినని సూర్యారావు వెల్లడించారు. పొత్తులో ప్రకటించిన సీట్లలో తన పేరు లేదని.. ఉంటే ఉండు , పోతే పో అన్నట్లు టీడీపీలో తనను చూశారని ఆయన పేర్కొన్నారు. 

తనకు పదవులతో సంబంధం లేదని.. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానని సూర్యారావు పేర్కొన్నారు. వైసీపీ రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తుందని.. ఎన్టీఆర్ మరణం తరువాత టీడీపీలో విలువలు లేకుండా పోయాయని గొల్లపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌కు పార్టీ అన్నా , ప్రభుత్వం అన్నా లెక్క లేదన్నారు. లోకేష్ తండ్రిని పక్కనపెట్టాడని, ఆయన ముఠా రాష్ట్రాన్ని చిందర వందరగా చేయడం పనిగా పెట్టుకుందని గొల్లపల్లి దుయ్యబట్టారు. లోకేష్ దుర్మార్గపు ఆలోచనలతో పార్టీని నడుపుతున్నారని.. సీనియర్లు ఎవరెవరు త్యాగాలు చేశారో తెలీయదన్నారు. అధికారం కోసం చంద్రబాబు మౌన మునిగా మారారని సూర్యారావు వెల్లడించారు. 

Scroll to load tweet…