కర్నూలు ఎంఎల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
- ప్రధాన పార్టీల మధ్య మరో ఉత్కంఠపోరుకు తెరలేవనున్నది.
ప్రధాన పార్టీల మధ్య మరో ఉత్కంఠపోరుకు తెరలేవనున్నది. అది కూడా మొన్న ఉప ఎన్నికలు జరిగిన జిల్లాలోనే కావటం గమనార్హం. ఇంతకీ విషయం ఏమిటంటే, కర్నూలు జిల్లాలో స్ధానిక సంస్ధల కోటాలో ఎంఎల్సీ ఎన్నికకు ఎన్నికల కమీషన్ భేరి మోగించింది. మొన్న జరిగిన నంద్యాల ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఎంతటి టెన్షన్ పెంచేసిందో అందరూ చూసిందే. అటువంటిది మళ్ళీ అదే జిల్లాలో మరో ఎన్నికంటే మాటలు కాదు.
టిడిపి ఎంఎల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి కోసం టిడిపి ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. దాంతో ఎన్నిక అనివార్యమైంది. సరే, సోదరుని కోసం చక్రపాణిరెడ్డి పదవి త్యాగం చేసినా ఉపయోగం కనబడలేదనుకోండి అదివేరే సంగతి. అప్పట్లో ఉపఎన్నిక ఫలితం వచ్చేంత వరకూ టిడిపి-వైసిపి మధ్య పోటీ తీవ్ర ఉత్కంఠన రేపిందన్నది మాత్రం వాస్తవం.
తీరా ఫలితం వచ్చిన తర్వాత టిడిపి ఉపఎన్నికలో ఎలా గెలిచింది అన్న విషయమై ఇప్పటీకీ పోస్టు మార్టమ్ జరుగుతూనే ఉంది. సరే, టిడిపి అవలంభించిన మార్గమేదైనా, చేసిన రాజకీయమేదైనా అంతిమంగా చూసేది గెలుపే కదా? మరి, రేపటి ఎంఎల్సీ ఎన్నికలో ఏమవుతుందో ఇపుడే చెప్పలేం. ఎందుకంటే, వైసిపి తరపున చక్రపాణిరెడ్డి ఈసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి, టిడిపి తరపున ఎవరుంటారో చూడాలి.
నంద్యాల ఉపఎన్నికలో టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచిన తర్వాత జిల్లాతో పాటు నియోజకవర్గంలో కూడా పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. మంత్రి భూమా అఖిలప్రియ మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. దానికితోడు ఇటీవలే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జిల్లాలో బాగా సక్సెస్ అయ్యింది. అంతిమంగా ఫలితం ఎలా ఉన్నా పోరు ఎలా ఉంటుందో చూడాలి.
ఈనెల 19వ తేదీన షెడ్యూల్ విడుదల అవుతుంది. జనవరి 12న పోలింగ్, జనవరి 16వ తేదీన కౌటింగ్ జరుగుతుంది.