లాభం ఉండదు: పవన్ కల్యాణ్ డిమాండ్ పై రఘురామ స్పందన
రాజీనామాలతో ప్రయోజనం ఉండదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. అమరావతి విషయంలో టీడీపీ, వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే
అమరావతి: రాజీనామాలతో ప్రయోజనం ఉండదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. అమరావతి విషయంలో టీడీపీ, వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై రఘురామకృష్ణంరాజు స్పందించారు.అమరావతి కోసం తొందరపడి ఎవరూ రాజీనామాలు చేయొద్దని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సూచించారు.
చేయాల్సింది రాజీనామాలు కాదని రాజీలేని పోరాటమన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన బీటెక్ రవి తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు. కౌన్సిల్లో ఉండి పోరాటం చేయాలన్నారు. రాజీనామా చేస్తే తనలాగా రక్షణ లేకుండా పోతుందన్నారు.
also read:అమరావతిపై టీడీపీ, వైసీపీ,జనసేన రాజీనామా సవాళ్లు: వేడేక్కిన ఏపీ రాజకీయాలు
తనకైతే కేంద్రం భద్రత కల్పిస్తుందన్న నమ్మకముందన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఓటింగ్ నిర్వహించాలని సూచించారు. కొవ్వొత్తులతో కొంతమంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని అయితే అవి సంతాపానికి సూచనగా ఉపయోగిస్తారని తెలియదా అని ఎద్దేవా చేశారు.
అనంతపురం వాళ్లు విశాఖ వెళ్లాలంటే 24 గంటల సమయం పడుతుందని విశాఖ దూరమని వ్యాఖ్యానించారు. అమరావతికి వ్యతిరేకమై ప్రజాప్రతినిధులు రాజకీయ భవిష్యత్తును కోల్పోవద్దన్నారు.
ఒకవేళ డబ్బులతోనే గెలుపు వస్తుందంటే ఎన్నికల ముందు చంద్రబాబు 10వేలు ఇస్తే ప్రతిపక్షంగా ఎంత కంగారుపడ్డామో తెలియదా అన్నారు. కానీ తర్వాత ఏమైందని అవి టీడీపీకి ఓట్లు తీసుకురాలేదని ఆయన గుర్తు చేశారు. ఆ విషయాన్ని అధికారంలో ఉన్న వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.