జగన్ రెడ్డి ఉన్మాదానికి నిదర్శనమే... డాక్టర్ సుధాకర్ మృతి: వర్ల ధ్వజం
నూటికి నూరుపాళ్లు డాక్టర్ సుధాాకర్ మరణం జగన్ సర్కారు చేసిన హత్యేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు.
గుంటూరు: సీబీఐ దర్యాప్తు సకాలంలో పూర్తైతే డాక్టర్ సుధాకర్ ప్రాణం పోయేది కాదన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. సుధాకర్ మరణానికి జగన్ రెడ్డి ఉన్మాద మనస్తత్వమే కారణమని మండిపడ్డారు. నూటికి నూరుపాళ్లు ఇది సర్కారు హత్యేనని వర్ల ఆరోపించారు.
''ఏడాది కాలంగా బెదిరింపులు, వేధింపులతో మానసికంగా హింసించారు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే మానసిక క్షోభకు గురై ఆయన చనిపోయారు. సీబీఐ దర్యాప్తు సకాలంలో పూర్తి చేసి ఉంటే మనోవేదన తప్పేది కాబట్టి ఆయన బ్రతికేవారు'' అని రామయ్య అభిప్రాయపడ్డారు.
read more డాక్టర్ సుధాకర్ మరణం... జగన్ రాజీనామాకు అచ్చెన్న డిమాండ్
''రాక్షసత్వానికి, మూర్ఖత్వానికి నిలువుటద్దం సీఎం జగన్ రెడ్డి. ప్రశ్నించేవారిని హింసించడమే ధ్యేయంగా వైసిపి పాలన సాగుతోంది. దళితులకు ప్రశ్నించే హక్కే లేదన్నట్లుగా రాష్ట్రంలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓట్లేసి గెలిపించినందుకు అక్రమ కేసులు, శిరో ముండనాలే బహుమానాలా?'' అని వర్ల ప్రశ్నించారు.
''డాక్టర్ సుధాకర్ లాంటి దళితులు ఇంకా ఎంత మంది ప్రభుత్వ అరాచకాలకు బలవ్వాలి? సుధాకర్ మరణానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళి దండవేసి దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలి'' అని వర్ల డిమాండ్ చేశారు.