Asianet News TeluguAsianet News Telugu

దళిత ప్రతిఘటన ర్యాలీని నిలువరించామనుకుంటే పొరపడినట్టే: జగన్ సర్కార్ కు జవహర్ వార్నింగ్

వైసిపి ప్రభుత్వ పాలనలో దళితులపై దమనకాండ సాగుతోందంటూ విజయవాడలో ఇవాళ ప్రతిఘటన ర్యాలీకి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. 

dalit protest in vijayawada... tdp  leader ks jawahar serious on jagan govt akp
Author
Vijayawada, First Published Aug 10, 2021, 12:27 PM IST

విజయవాడ: దళితులపై జగన్ సర్కార్ సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా చేపట్టిన దళిత ప్రతిఘటన ర్యాలీని నిలువరించామని అనుకుంటే పొరపడినట్టేనని మాజీ మంత్రి కేఎస్ జవహర్ హెచ్చరించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ అదే దళితులపై దమనకాండ కొనసాగించటం ఆపాలని జవహర్ డిమాండ్ చేశారు.

''దళిత రాజధాని అమరావతిపై అక్కసుకు కారణమేంటో సీఎం జగన్ తెలపాలి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపైనా జగన్ సమాధానం చెప్పాలి. వైసిపి ప్రభుత్వం పాలించిన ఈ రెండేళ్ళలో దళితులపై జరిగిన దాడులపై శ్వేత పత్రం విడుదల చెయ్యాలి" అని జవహర్ డిమాండ్ చేశారు.

''దళితుల అభ్యున్నతి కోసం ఏర్పాటుచేసిన వివిధ కార్పోరేషన్లకు ఈ ప్రభుత్వం కేటాయించిన నిధులు శూన్యం. దళితులకు మంచి విద్య అందకుండా మంగళం పాడింది నిజమే కదా జగన్? బెస్ట్ ఎవలబుల్ స్కూల్ స్కీమ్ ఎందుకు మూసివేశారో చెప్పాలి. అంబేద్కర్ విదేశి విద్య ఎందుకు ఆపారు.మీ పిల్లలతో సమానంగా మా పిల్లలు విదేశాల్లో చదువకూడదనేగా మీ ఉద్దేశం. దళిత హక్కులను కాలరాయటమే జగన్ ఎజెండాగా మారింది'' అని మాజీ మంత్రి మండిపడ్డారు. 

read more  దళితులపై జగన్ సర్కార్ దమనకాండ... విజయవాడలో ప్రతిఘటన ర్యాలీ: మాజీ మంత్రి ప్రకటన

దళితులపై కక్షగట్టి దమనకాండ సాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వ మెడలు వంచి... దళితులకు న్యాయం చేసేందుకు అంటూ ఆగస్టు 10న అంటే ఇవాళ దళిత ప్రతిఘటన ర్యాలీకి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  విజయవాడ జింఖానా మైదానంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ఈ ప్రతిఘటన ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 
 
ఇంట్లోంచి బయటకు వచ్చిన తనను అడ్డుకున్న పోలీసుల తీరుపట్ల ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు మాజీ మంత్రికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆనంద్ బాబు దళిత ప్రతిఘటన ర్యాలీకి వెళ్లలేకపోయారు.  

దళితులపై జగన్ కక్ష కట్టినట్లుగా పాలన చేస్తున్నాడని ఆనంద్ బాబు మండిపడ్డారు. దమ్ముంటే దళితుల అభివృద్ధిపై చర్చకు రావాలి అని ఆనంద్ బాబు జగన్ సర్కార్ కు సవాల్ విసిరారు.  

 
 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios