విశాఖలో ముందుకొచ్చిన సముద్రం... ఆర్కే బీచ్ సందర్శనకు నో పర్మిషన్
విశాఖలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రామకృష్ణ బీచ్ వద్ద సమద్రం ముందుకు రావడంతో సందర్శకుల అనుమతిని నిరాకరించారు అధికారులు.
విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రామకృష్ణ బీచ్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కారణమేంటో తేలీదుగానీ బీచ్ వద్ద సముద్రం ముందుకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఆర్కే బీచ్ లోకి సందర్శకులను నిలిపివేసారు.
RK Beach నుండి దుర్గాలమ్మ గుడివరకు దాదాపు 200మీటర్లు భూమి కోతకు గురయ్యంది. దీంతో బీచ్ సమీపంలోని చిల్డ్రన్పార్కు వద్ద కూడా భూమి 10 అడుగుల మేర కోతకు గురయి ప్రహరీ గోడ కూలిపోయింది. అక్కడ ఉన్న బల్లలు విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి.
read more cyclone jawad : దిశ మార్చుకున్న జవాద్ తుపాన్.. ఉత్తరాంధ్రకు తప్పిన పెనుముప్పు, కానీ
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సందర్శకులు బీచ్ లోకి వెళ్లకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నోవాటెల్ హోటల్ ముందుభాగంలో బారికేడ్లు పెట్టారు. జవాద్ తుపాను నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జవాద్ తుఫాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫానుగా మారి ఉత్తరాంధ్ర-ఒడిషా తీరంవైపు దూసుకువస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సముద్రంలోనే జవాద్ తుఫాను బలహీనపడిందని... దీని వల్ల ఇక ఏపీకి పెద్దగా ముప్పేమీ వుండదని ఐఎండీ తెలిపింది.
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న cyclone jawad బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు ఐఎండి తెలిపింది. ఇది ఉత్తర-ఈశాన్య దిశల వైపు కదిలి మధ్యాహ్నానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని ప్రకటించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ప్రమాదకర స్థాయిలో కాకుండా ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశాలున్నాయని IMD తెలిపింది.
visakhapatnam కు తూర్పు-ఆగ్నేయంగా 180 కి.మీ, ఒడిషాలోకి గోపాల్పూర్ కి దక్షిణంగా 200 కి.మీ, పూరీకి నైరుతి-నైరుతి దిశలో 270 కి.మీ, పారాదీప్ కి నైరుతి-నైరుతి దిశలో 360 కి.మీ దూరంలో ప్రస్తుతం వాయుగుండం కేంద్రీకృతమై వుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
జవాద్ తుఫాను బలహీనపడ్డప్పటికి తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కొనసాగనున్నాయని హెచ్చరించారు. కాబట్టి తీరప్రాంతాల్లో నివాసముండే ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఇవాళ ఉత్తరాంధ్ర, ఒడిస్సా తీరంలో వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు ఐఎండి సూచించింది.