కారులో అక్రమ మద్యం తరలింపు: ఆబ్కారీ సీఐపై సస్పెన్షన్ వేటు
ఆబ్కారీ సీఐ త్రినాథ్ మీద సస్పెన్షన్ వేటు పడింది. అక్రమంగా కారులో మద్యం తరలించిన వ్యవహారంపై ఆయనను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆదేశాలు జారీ చేశారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ మీద సస్పెన్షన్ వేటు పడింది. రెడ్డి త్రినాథ్ ను సస్పెండ్ చేస్తూ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆదేశాలు జారీ చేశారు.
ఆదివారంనాడు కారులో అక్రమంగా మద్యం తరలిస్తుిండగా కుతుకులూరులో అనపర్తి ఎమ్మెల్యేతో పాటు స్థానికులు ఆయనను పట్టుకున్నారు. సిఐ త్రినాథ్ మీద డీప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్రినాథ్ ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనకు ఐదు లక్షల జరిమానా విధించినట్లు నారాయణ స్వామి తెలిపారు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్లుగా ఆబ్కారీ శాఖలో కొందరు అధికారుల తీరు దారుణంగా ఉందని ఆయన అన్నారు.
త్రినాథ్ మీద శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించినట్లు డిప్యూటీ సిఎం చెప్పారు. అక్రమాలకు పాల్పడేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.