రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత మూడు నెలలుగా నిరంతరాయంగా సాగుతున్న ఉద్యమంపై కరోనా  వైరస్ ఎఫెక్ట్ పడింది. 

అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇరుతెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులోభాగంగానే అమరావతి రైతులు, ప్రజలు రాజధాని కోసం చేస్తున్న ఉద్యమాన్ని నిలిపివేయాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇలా ప్రజలు ఒకచోట గుమిగూడటం వల్ల వైరస్ ఒకరినుండి మరొకరికి వేగంగా వ్యాప్తిచెందే అవకాశం వుండటంతో దీక్షను కొన్నాళ్లపాటు నిలిపివేయాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్ళూరు మండల రైతులు మూడు నెలలుగా నిరసన దీక్ష చేపట్టారు. అయితే తాజాగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ఈ దీక్షా శిబిరాలలో తుళ్ళూరు పోలీసులు మండల వైద్య సిబ్బంది కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో, ఇది ఎలా వ్యాప్తి చెందుతుందో దీక్షాశిబిరాల్లో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఇలా తుళ్ళూరు, పెదపరిమి దీక్షా శిబిరాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

read more కరోనా ఎఫెక్ట్: ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేసిన జగన్

ప్రజలు ఒకచోట గుమిగూడటం వల్ల కరోన(కోవిడ్19) వైరస్ వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర, రాష్ట్ర వైద్య శాఖలు సూచించాయని... అలా జరక్కుంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలున్నాయని సీఐ శ్రీహరిరావు తెలిపారు. ఈ సూచనల మేరకు తుళ్ళూరు శిబిరం నిర్వాహకులు జొన్నలగడ్డ రవి, కాట అప్పారావు పెదపరిమి దీక్ష శిబిరం నిర్వాహకులు అతిపట్ల బాలయ్యకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ దీక్షా శిబిరాల నిర్వహణను వైరస్ అదుపు అయ్యే వరకు కొన్ని రోజులు నిలిపివేయాలనే ఈ నోటీసులు అందించామని సిఐ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అవగాహన కార్యక్రమంలో స్థానికక పోలీసులతో పాటు తుళ్ళూరు మండల వైద్య సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పి ఝాన్సీ రాణి, జి వెంకటరమణ లు పాల్గొన్నారు. వీరు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అక్కడి ప్రజలకు వివరించారు.