ఇక కాంట్రాక్ట్ టీచర్లకూ... సెలవు కాలకంలో వేతనాలు: మంత్రి పుష్పశ్రీవాణి
తమకు సెలవు కాలంలోనూ వేతనాలివ్వాలని, ఏడాదిలో 10 రోజులుమినహా మిగిలిన 12 నెలల కాలాన్ని కూడా తమ పని దినాలుగా గుర్తించాలని సీఆర్టీలు చేసిన విన్నపాన్ని సీఎం జగన్ అంగీకరించారన్నారు మంత్రి పుష్ఫ శ్రీవాణి.
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్టీల) పని కాలాన్ని ఈ విద్యాసంవత్సరానికి 12 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు.
గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్(సీఆర్టీ)లకు ఇప్పటివరకు పనిచేస్తున్న కాలానికి మాత్రమే సేవలను పరిగణలోకి తీసుకుంటూ ఆమేరకే వేతనాలను కూడా చెల్లించడం జరిగేదన్నారు. విద్యాసంస్థలకు చివరి పనిదినమైన ఏప్రిల్ 23 వ తేది వరకు మాత్రమే సీఆర్టీల పనిదినాలను పరిగణలోకి తీసుకోవడం జరిగేదని... ఈ కారణంగా ఏప్రిల్ 23 నుంచి మళ్లీ విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యే జూన్ 12 దాకా వారికి వేతనాలను ఇచ్చేవారు కాదని తెలిపారు.
అయితే తమకు సెలవు కాలంలోనూ వేతనాలివ్వాలని, ఏడాదిలో 10 రోజులుమినహా మిగిలిన 12 నెలల కాలాన్ని కూడా తమ పని దినాలుగా గుర్తించాలని సీఆర్టీలు చేసిన విన్నపాన్ని సీఎం జగన్ అంగీకరించారన్నారు. ఈ క్రమంలోనే 2020-21 విద్యా సంవత్సరానికి గాను పది రోజులు మినహా మిగిలిన 12 నెలల కాలాన్ని కూడా వారికి పని దినాలుగానే పరిగణిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ అయ్యాయని పుష్ప శ్రీవాణి వివరించారు. ఈ మేరకు వారికి సంబంధించిన వేతనాలను కూడా చెల్లించడం జరుగుతుందని తెలిపారు.
తమ విన్నపాన్ని మన్నించి తమ సర్వీసు కాలాన్ని ఈ విద్యాసంవత్సరంలో పది రోజులు మినహా 12 నెలలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేయడం పట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలల సీఆర్టీల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి వారు ధన్యవాదాలు తెలిపారు.