వైసిపి ప్రభుత్వం ఏర్పాాటుచేసిన ఆర్-5 జోన్ లో విధులు నిర్వర్తిస్తూ పాముకాటుతో ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. 

గుంటూరు : అమరావతి పరిధిలోని పలు గ్రామాల్లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జగన్ సర్కార్ ఏర్పాటుచేసిన ఆర్‌-5 జోన్ రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత సృష్టించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసే పోలీసులను ఆర్-5 జోన్ లో విధులు కేటాయించారు. ఇలా తుళ్లూరు మండలం అనంతవరంలో బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ పాముకాటుకు గురయి మృతిచెందాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన పవన్ కుమార్ తాళ్లూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసేవాడు.ఆర్-5 జోన్ ఏర్పాటుతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పవన్ తో పాటు మరికొందరు పోలీసులకు ఆ ప్రాంతంలో బందోబస్తు విధులు కేటాయించారు. ఈ క్రమంలోనే అనంతవరం గ్రామంలో విధులు నిర్వర్తిస్తుండగా పవన్ పాముకాటుకు గురయ్యాడు. 

రెండ్రోజుల క్రితమే పవన్ పాముకాటుకు గురవగా గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందాడు. ఈ క్రమంలోనే అతడి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాపాడేందుకు పోలీస్ శాఖ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 

Read More హయత్‌నగర్ పాప మృతి కేసు.. ఎస్సై స్వప్న భర్తకు నోటీసులు.. అరెస్ట్ చేయకపోవడంపై పాప బంధువుల ఆగ్రహం..!!

కానిస్టేబుల్ పవన్ మృతితో స్వగ్రామం చీమకుర్తిలో విషాదం నెలకొంది. అతడి భార్యాపిల్లలతో పాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీస్ అధికారులు కూడా పవన్ మృతిపై సంతాపం వ్యక్తం చేసి కుటుంబసభ్యులను సానుభూతి ప్రకటించారు. 

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో కానిస్టేబుల్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. వ్యక్తిగతంగా మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ఎమ్మెల్యే ఆర్కే. స్వయంగా ఆయనే మృతుడి భార్యకు ఆ డబ్బులు అందజేసారు.