సీతానగరం ఘటనపై జగన్ సీరియస్... ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం పోలీస్స్టేషన్లో దళిత యువకుడి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు.
అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం పోలీస్స్టేషన్లో దళిత యువకుడి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. సీఎంఓ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్న సీఎం బాధ్యులైన సిబ్బందిపై తక్షణ చర్యలకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ చోటు చేసుకోరాదని స్పష్టంచేశారు.
సీఎం ఆదేశాల మేరకు స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆరోపణలపై విచారణ జరిపించారు. ఈ క్రమంలో ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. చట్ట ప్రకారం తదుపరి చర్యలుంటాయన్న డీజీపీ వెల్లడించారు.
read more పోలీసుల ఎదుటే యువకుడికి గుండుగీయించి...వైసిపి నాయకుల దాడి: చంద్రబాబు సీరియస్
సీఎం ఆదేశాల కంటే ముందే తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న ఏపీ డీజీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన పూర్తి విచారణకు ఆదేశించారు. అయితే సీఎం ఆదేశాలతో విచారణను మరింత వేగవంతంగా పూర్తిచేసి కారకులయిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి వ్యవహరశైలిని ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉపేక్షించబోమని డీజీపీ స్పష్టం చేశారు.
కాగా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే దళిత యువకుడిని అరెస్ట్ చేసిన సీతానగరం పోలీసులు తీవ్రంగా కొట్టారు. అక్కడితో ఆగకుండా యువకుడికి శిరోముండనం చేశారు. తీవ్రగాయాల పాలైన అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అధికారులు ఇన్ఛార్జి ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.
ఇసుక లారీలు అడ్డుకున్నందుకే తనపై దాడి చేశాడని బాధిత యువకుడు ఆరోపిస్తున్నాడు. ఆ సమయంలో స్థానిక మునికూడలి వద్ద వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు. వెదుళ్లపల్లిలోని బాధితుడు వరప్రసాద్ ఇంటికి వెళ్లి కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ ఆందోళన చేపట్టాయి.