చంద్రబాబు ‘పోలవరం’ అబద్ధాలు
- ‘పోలవరం ప్రాజెక్టు బాధ్యతను అప్పగించాలని కేంద్రాన్ని తాము కోరనేలేదు’..ఇవి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు.
‘పోలవరం ప్రాజెక్టు బాధ్యతను అప్పగించాలని కేంద్రాన్ని తాము కోరనేలేదు’..ఇవి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. నిజ్జంగా నిజం. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మిస్తుందని చంద్రబాబునాయుడు అసలు కేంద్రాన్ని అడగనే లేదట. కేంద్రమే వెంటపడి మరీ నిర్మాణ బాధ్యతలను అప్పగించిందట. పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికే అప్పగించాలని నీతి అయోగ్ కూడా సిఫారసు చేసిందట. అందుకనే, కేంద్రమే చంద్రబాబు వెంటపడి పోలవరం నిర్మాణ బాధ్యతల నుండి తప్పుకుందట.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు చెప్పిన అక్షర సత్యాలు. మరి, ఇంతకాలం చంద్రబాబే కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం నుండి లాక్కున్నారని ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయే? అంటి సమాచారం లోపం వల్లే ప్రతిపక్షాలు అలా ఆరోపిస్తున్నాయి. మూడేళ్ళుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా నోరు విప్పని నిప్పు చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో వాస్తవాలను బయటపెట్టారు. అదికూడా ప్రధాన ప్రతిపక్షం వైసిపిలేని సమయంలో. మరి, సభకు వైసిపి హాజరైనంత కాలం ఈ విషయాన్ని చంద్రబాబు ఎక్కడా చెప్పిన గుర్తులేదు.
ఇదే విషయమై సామాజిక ఉద్యమకారుడు, పోలవరం నిర్వాశితుల తరపున పోరాడుతున్న పెంటపాటి పుల్లారావు ‘ఏషియా నెట్’ తో మాట్లాడుతూ, పోలవరం నిర్మాణ బాధ్యతలపై చంద్రబాబు చేసిన ప్రకటన అవాస్తవమన్నారు. చంద్రబాబు అడిగినందునే పోలవరం బాధ్యతలను రాష్ట్రానికి అప్పగిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఎన్నోసార్లు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అసలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్దతి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. 5 లక్షల మంది నిర్వాసితుల తరలింపుపై ప్రభుత్వం జగ్రత్తలు తీసుకోవటం లేదని ఆరోపించారు. నిర్వాసితులు 25 నియోజకవర్గాల పరిధిలో విస్తరించినట్లు పుల్లారావు తెలిపారు.