జనసేన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా తాము సీఎం జగన్‌ను తీసుకువచ్చామని, ఇంతటి అద్భుత అవకాశానికి తాము హర్షిస్తున్నామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.  

Janasena: జనసేన పార్టీ ఈ రోజు విజయవాడలో ఓ ప్రెస్ మీట్ పెట్టింది. అందులో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ లెక్కలపై మాట్లాడేందుకు తాము సిద్ధం అని చెప్పారు. కానీ, సీఎం జగన్ సిద్ధమా? అని ప్రశ్న వేశారు. సీఎం జగన్ మీడియా ముందుకు రారని దుయ్యబట్టారు. ఎవరితో మాట్లాడదని, సలహాలు, సూచనలు తీసుకోరని ఆరోపించారు. అందుకోసం తాము సీఎం జగన్‌ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీసుకువచ్చామని వివరించారు. ఇంతలోనే నాదెండ్ల మనోహర్ పక్క కుర్చీలో సీఎం జగన్ కటౌట్‌ను ఓ కార్యకర్త ఉంచారు. జగన్‌ను చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం నాదెండ్ల మనోహర్ ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

జగన్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో లెక్కలు తారుమారు చేసిందని, ఎన్నో అవకతవకలకు పాల్పడిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్‌లు రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాయని, సీఎం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ లెక్కలపై తాము చర్చించడానికి ఆహ్వానిస్తున్నామని చాలెంజ్ విసిరారు. ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోని హుందాగా అన్ని లెక్కలను చర్చిద్దామని అన్నారు. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు.

Scroll to load tweet…

Also Read: MLC Kavitha : 30 లక్షల ఉద్యోగాల వివరాలేవో చెప్పాలి : కవితపై కాంగ్రెస్ ఎటాక్

అంతేకానీ, సభలు పెట్టి జగన్ తన గొంతు చించుకునేలా అరిస్తే వచ్చేదేమీ ఉండదని నాదెండ్ల అన్నారు. ఆ సభల్లో ప్రతిపక్షాలపై దాడి చేస్తూ.. సాధారణ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సబబేనా? అని ప్రశ్నించారు. తన రాజకీయ ప్రస్థానంలో అలాంటి సభలు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. ఈ వీడియో కింద పలు కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. కొందరు నిజంగానే వైఎస్ జగన్ అక్కడ కూర్చుని ఉన్నట్టు ఫొటో మార్చి పెట్టారు. మరికొందరు ఆ స్థానంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫొటోను చేర్చి పంచుకున్నారు.