జనసేన నేతల మధ్య వర్గ విభేదాలు: సోషల్ మీడియా వేదికగా విమర్శలు
నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా పార్టీలోని నేతలు పరస్పరం విమర్శలు చేసుకొంటున్నారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా పార్టీలోని నేతలు పరస్పరం విమర్శలు చేసుకొంటున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో అభ్యర్థుల్లో మార్పు రావడం లాంటి పరిణామాలు పార్టీలో వర్గ విభేధాలకు కారణమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు నేతలు ఒకరిపై మరోకరు కేసులు పెట్టుకొనే పరిస్థితి వరకు వచ్చింది.
జిల్లాలోని ఆత్మకూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు కూడ వచ్చాయి.
వెంకటగిరిలో జనసేన టిక్కెట్టు ఆశించిన నేత చివరి నిమిషంలో బీఎస్పీలో చేరాడు. దీంతో క్యాడర్ కూడ తమ ఇష్టారీతిలో వ్యవహరించారు. తమకు తోచిన పార్టీలో చేరారు. కావలిలో పి. సుధాకర్ కు వ్యతిరేకంగా ఓ మహిళా నేత కూడ రెబెల్గా బరిలో దిగిన విషయం తెలిసిందే.
కోవూరులో పార్టీ అభ్యర్థి స్థానిక నేతలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. సర్వేపల్లిలో పార్టీ నేత ఒకరు పార్టీ క్యాడర్ను సరిగా పట్టించుకోలేదనే ఆరోపణలు కూడ లేకపోలేదు. నెల్లూరు నగరంలో కూడ పి.సంతోషకు కాదని కేతంరెడ్డికి టిక్కెట్టు కేటాయించడంతో ఈ ఇద్దరు నేతల మధ్య విభేధాలు తీవ్రమయ్యాయి. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నేత టోనిబాబు తనకు టిక్కెట్టు దక్కకపోవడంతో రూరల్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశాడు.
సోషల్ మీడియా వేదికగా కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకొంటున్నారు. ఈ విమర్శల తీవ్రత పెరగడంతో కొందరు పోలీసులను కూడ ఆశ్రయించిన పరిస్థితి కూడ నెలకొంది.
ఈ పరిణామాలపై జనసేన రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ సమీక్షల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయా అనే సందేహాలు కూడ లేకపోలేదు.