శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు, చెప్పులతో దాడికి దిగారు.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ది, అవినీతి, అక్రమాలపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, వైసీసీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిల పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. పుట్టపర్తి అభివృద్దిపై పట్టణంలోని సత్తెమ్మ ఆలయం వద్ద ప్రమాణం చేయాలని పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. అయితే టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు సత్తెమ్మ ఆలయానికి చేరుకుని.. పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, చెప్పులు విసురుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ దాడిలో అక్కడ ఉన్న పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు అక్కడే ఉన్న ఇరువర్గాలను కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సత్తెమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా టీడీపీ నేతల వైఖరిని ఆయన తప్పుపట్టారు. సీఎం జగన్‌పై పల్లె రఘునాథ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పల్లె రఘునాథ్ రెడ్డిని పోలీసులు అడ్డుకోగా.. అక్కడ చోటుచేసుకున్న తోపులాటలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. మరోవైపు ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అయితే పోలీసులు ఆయనను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ మధ్య.. పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం ధ్వంసం అయింది. 

అయితే టీడీపీ-వైసీపీల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో.. పోలీసులు లాఠీ చార్జీ చేసి ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొడుతున్నారు. పుట్టపర్తిలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం పుట్టపర్తిలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు.