వైసిపి కార్యకర్తల ఇళ్లు ధ్వంసం: అవినాష్ రెడ్డి అరెస్టు, ఉద్రిక్తత
కడప జడిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెదండ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి.
కడప: కడప జడిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెదండ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. వైసిపి కార్యకర్తల ఇళ్లను మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచరులు ధ్వంసం చేశారు. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
వైఎస్సార్సీపీ కార్యకర్త ఆహ్వానం మేరకు పెళ్లి విందుకు హాజరు కావడానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని మంత్రి ఆదినారయణ రెడ్డి వర్గీయులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
దాంత పెదదండ్లూరు శివారులో ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్రెడ్డి, కడప మేయర్ సురేశ్బాబులను పోలీసులు అడ్డుకున్నారు. ఆది వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. సుగమంచిపల్లికి చెందిన సబ్బరామిరెడ్డిని మంత్రి ఆది వర్గీయులు కిడ్నాప్ చేశారని వైసిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
తమ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తుంటే సహించబోమని, గ్రామంలోకి వెళ్తామని సుధీర్ రెడ్డి, సురేశ్ బాబులు పట్టుబట్టారు. తమ వర్గీయులపై మంత్రి ఆదినారాయణ రెడ్డి అనచరులు దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి పెదదండ్లూరు బయలుదేరారు. ఆయనను కూడా పోలీసులు జమ్మలమడుగులో అడ్డుకున్నారు.
పోలీసుల తీరును నిరసిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సురేశ్ బాబులతో పాటు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై లాఠీ చార్జీ చేసి అరెస్ట్ చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు సుధీర్ రెడ్డి, సురేశ్ బాబులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.