వాళ్ల తప్పులకు నేనెలా బాధ్యుడిని అవుతా... చంద్రబాబు
సమన్వయ కమిటీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
ఎవరు చేసిన తప్పులకు వారే బాధ్యులు అవుతారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. బుధవారం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ నిర్వహించారు. గత నెల 20వ తేదీన తిరుపతిలో చేపట్టిన ధర్మపోరాట దీక్ష విజయవంతమైందని తెలిపారు.
ఇలాంటి ధర్మపోరాట దీక్షలు మరో 12చోట్ల చేపడతానని పేర్కొన్నారు. తదుపరి ధర్మపోరాట దీక్ష విశాఖలో చేపట్టనున్నట్లు చెప్పారు. చివరిది రాజధాని అమరావతిలో చేపడతానన్నారు. నేతలు చేసిన తప్పులను తనపై వేసుకునేందుకు సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేశారు. నేతల ప్రతీ చర్యకూ ప్రజల్లో ప్రతి చర్య ఉంటుందన్నారు.
అనంతరం ప్రతిపక్ష వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి హోదా ఇవ్వని బీజేపీని విమర్శించకుండా.. హోదా కోసం పోరాడుతున్న తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. జగన్ పై ఈడీ అటాచ్ మెంట్లు సడలిస్తున్నారన్నారు. కర్ణాటకలో మైనింగ్ కేసులు తొలగిస్తున్నారన్నారు. ఇదేనా అవినీతిపై బీజేపీ చేస్తున్న పోరాటమని ప్రశ్నించారు. కుడి, ఎడమ అవినీతి పరులను పెట్టుకొని బీజీపీ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.