కొర్రీలు పెడుతున్నారు, ఢిల్లీకి వస్తా: గడ్కరీకి చంద్రబాబు ఘాటు రిప్లై
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2250 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2250 కోట్లను కేంద్రం వెంటనే చెల్లించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. డీపీఆర్-1లో రూ.400 కోట్లకుపైగా నిధులను ఇవ్వాల్సి ఉందన్నారు. డీపీఆర్-2 కేంద్రానికి సమర్పించి ఏడాది దాటినా కేంద్రం నుండి స్పందన లేదన్నారు.
గురువారం నాడు అమరావతిలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. డీపీఆర్-2 ఇచ్చి ఏడాది దాటినా కేంద్రం నుండి ఇంకా కొర్రీలు పెడుతున్నారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి గడ్కరీ మాత్రం రాష్ట్రం నుండి సమాధానం రావాల్సి ఉందని కోరినట్టు చంద్రబాబునాయుడు ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ రకమైన సమాచారం కావాలంటే ఆ సమాచారాన్ని ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు చెప్పామన్నారు. తమ అధికారులను ఢిల్లీకి వారం రోజులు పంపిస్తామన్నారు. అవసరమైతే తాను కూడ వచ్చి పోలవరం విషయమై సమాధానం చెబుతానని కేంద్ర మంత్రి గడ్కరీకి సమాధానం చెప్పినట్టు బాబు ఈ సమావేశంలో గుర్తు చేశారు. మరో వైపు అవసరమైతే సెక్రటేరియట్ను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ సమాచారాన్నైనా ఇస్తామని కేంద్రమంత్రి గడ్కరీకి హమీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
బీజేపీ, వైసీపీ లేదా ఎవరో చేసిన ఆరోపణలను దృష్టిలో మాట్లాడడం సరైంది కాదని తాను కేంద్ర మంత్రి గడ్కరీకి తాను స్పష్టం చేసినట్టు చెప్పారు. ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రమంత్రి గడ్కరీ తనను కోరినట్టు చెప్పారు.దానికి రాష్ట్రం సంసిద్దంగా ఉందన్నారు. అయితే కేంద్రం నుండి నిధులు కూడ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును 56 శాతం పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు.
భూసేకరణ వ్యయం పెరగడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం కారణమని ఆయన చెప్పారు. భూ సేకరణ వల్లే పెరిగిందన్నారు. ఇది రాష్ట్రానికి సంబంధం లేని విషయాన్ని తాను మంత్రి దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు ముంపులో ఎక్కువగా గిరిజనులు నిర్వాసితులుగా మారుతున్నారని బాబు చెప్పారు. అయితే జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు కూడ ముంపు ప్రాంతాల్లో పర్యటించి గిరిజనులకు పునరావాసం కల్పించడంై సంతృప్తిని వ్యక్తం చేసినట్టు ఆయన చెప్పారు.
రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని బీజేపీ, వైసీపీ నేతలకు చంద్రబాబునాయుడు హితవు పలికారు. సరైన ప్రణాళికలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లకపోతే రాష్ట్రం మరో బీహార్ గా మారేదన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అనేక కుంభకోణాలు చోటుచేసుకొన్నాయని ఆయన చెప్పారు. ఈ కుంభకోణాల కారణంగా కొందరు అధికారులు కూడ జైళ్లకు వెళ్లారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.
వరుసగా మూడేళ్లపాటు ఏపీ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమస్థానంలో నిలిచిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హమీని అమలు చేసినట్టు చెప్పారు. నిరుద్యోగులకు త్వరలోనే నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నట్టు చెప్పారు. అన్న క్యాంటీన్లను కూడ ప్రారంభించిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.
చంద్రన్న పెళ్లికానుక కింద నిరుపేదలకు ఇచ్చే పెళ్లికానుక నిధులను పెళ్లికి వారం ముందే ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు.