మోడికి చంద్రబాబు వార్నింగ్
చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడిని తీవ్ర హెచ్చరికలే చేశారు. ప్రత్యేకహోదా డిమాండ్ తో శుక్రవారం ఉదయం సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రులతో పెట్టుకోవద్దంటూ మోడికి వార్నింగ్ చ్చారు.
కేంద్రం చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజలంతా మన రాజధాని అన్న భావనతో రాష్ట్ర అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అమరావతి కోసం రూ.50 వేల కోట్ల విలువ చేసే 33వేల ఎకరాల భూములిచ్చిన రైతులను అభినందించారు . రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములపైనా కొంతమంది రాద్దాంతం చేస్తున్నట్లు మండిపడ్డారు.
ఢిల్లీతో పోరాడాల్సింది పోయి మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా వైసిపిపై మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం ప్రజలు ఆర్ధిక సాయం అందించటం అభినందనీయమన్నారు. కుట్రలు తిప్పికొట్టడం టీడీపీకి కొత్త కాదని హెచ్చరించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే అన్నారు. తెలుగువారి జోలికొస్తే ఎదురయ్యే పరిణామాలను కనీసం ఊహించలేరంటూ మోదీని హెచ్చరించారు .