కేంద్రంతో వివాదాలొద్దు
- కేంద్రంతో వివాదాల్లోకి దిగితే రాష్ట్రం నష్టపోతుందన్నారు.
కేంద్రంతో ఎట్టి పరిస్దితుల్లోనూ వివాదాలు వద్దంటూ చంద్రబాబునాయుడు నేతలకు స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నేతలతో గురువారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ సంరద్భంగా మాట్లాడుతూ, కేంద్రంతో వివాదాల్లోకి దిగితే రాష్ట్రం నష్టపోతుందన్నారు. మూడున్నరేళ్ళ కాలంలో కేంద్రం ఏపికి ఏం చేసిందనే విషయంలో బిజెపి శ్వేతపత్రం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
తర్వాత జనసేన అధ్యక్షుడి గురించి మాట్లాడుతూ, ‘పవన్ కల్యాణ్ మనోడే ఎటువంటి ఇబ్బందీ లేదు..తొందరపడి స్పందిచవద్దు’ అని చెప్పారు. పవన్ మన గురించి ఏమన్నా ఎవరూ తొంవదరపడి ఇష్టమొచ్చినట్లు స్పందిచవద్దన్నారు. అవసరమైనప్పుడల్లా పవన్ మనకు అండగా నిలబడుతున్నాడన్న అర్ధం వచ్చేలా చంద్రబాబు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
పవన్ జెఎఫ్ సితో మనకు ఎటువంటి ఇబ్బందీ లేదని చంద్రబాబు తేల్చేశారు. పవన్ అడిగిన లెక్కల గురించి మాట్లాడుతూ, అన్న వెబ్ సైట్లోనే ఉన్నాయని కొత్తగా ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పవన్ పోరాటంలో అర్ధముందని కితాబు కూడా ఇచ్చారు. పనిలో పనిగా వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన మాత్రం చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్ నాధ్ కోవింద్ అభ్యర్ధిత్వ బయటకు రాకముందే జగన్ వెళ్ళి ఫొటో దిగివచ్చారని మండిపడ్డారు.
త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు కూడా నేతలతో చంద్రబాబు చెప్పారు. అయితే ఆ కీలక నిర్ణయాలేమిటి అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. దాంతో చంద్రబాబు చెబుతున్న కీలక నిర్ణయాలేమిటి అనే విషయంలో నేతల్లో సస్పెన్స్ మొదలైంది.