కేంద్రాన్నినమ్మితే నట్టేట ముంచింది
‘కేంద్రం ఏపీకి సహాయ నిరాకరణ చేస్తోంది’..,
‘ఏపీపై కేంద్రానికి ఎందుకింత కోపం’..,
ఇవి తాజాగా చంద్రబాబునాయుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు. బుధవారం అసెంబ్లీలో కేంద్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఏపిపై ‘ఎందుకింత కక్ష..అసలు ఏపీ ప్రజలు చేసిన తప్పేంటి..’ అంటూ మండిపడ్డారు. మనం చేసేది ధర్మపోరాటం.., అవిశ్వాసంపై చర్చించే బాధ్యత కేంద్రానికి లేదా? అని చంద్రబాబు నిలదీశారు.
హామీలు అమలు చేయనప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదని, కేంద్రానికి జవాబుదారితనం లేదా? అని చంద్రబాబు మండిపడ్డారు. విభజన సమయంలో ఉన్న కోపం, ఆవేదన, బాధ నిన్నటి అఖిలపక్ష సమావేశంలో కనిపించిందని, వైసీపీ, జనసేన, బీజేపీ తప్ప అందరూ వచ్చారని, పార్లమెంట్లో ఏపీ ఎంపీలు పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ప్రధాని చెప్పిన మాటలను ప్రజలు నమ్మారని, నమ్మిన వాళ్లే మోసం చేస్తే ఎవరికి చెప్పాలని చంద్రబాబు ఆవేధన వ్యక్తం చేశారు.