పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన చంద్రబాబు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిప్పికొట్టారు.
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిప్పికొట్టారు. ఎవరి సహకారం వల్లనో తాము గెలువలేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో జనసేన సహకారం వల్లనే టీడీపి గెలిచిందని ఇటీవల పవన్ కల్యాణ్ పదే పదే అంటున్న విషయం తెలిసిందే. దానికి జవాబుగా చంద్రబాబు సోమవారం మహానాడులో ఆ విధంగా అన్నారు.
పవన్ కల్యాణ్ పైనే కాకుండా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మీద, బిజెపి మీద ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నాయకులంతా ఒకేలా ఉండరని, కొందరు పనిచేస్తూ కూడా పేరు తెచ్చుకోలేరని, మరికొందరు నియోజకవర్గంలో లేకపోయినా పనులు చేస్తుంటారని ఆయన అన్నారు.
విభేదాలు మాని అందరూ ఐక్యంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీ ఏం చేసిందని కాదు, పార్టీకి ఏం చేశామో ఆలోచించాలని అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని స్కామాంధ్రప్రదేశ్గా మార్చారని ఆయన ఆరోపించారు. ఏపీ ఇమేజ్ను వైఎస్ దెబ్బతీశారని ముఖ్యమంత్రి అన్నారు. వైఎస్ అవినీతి వల్ల పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్లు జైలుకెళ్లారని, వైఎస్ కుమారుడు జగన్ అతిపెద్ద అవినీతి పరుడని అన్నారు. అవినీతిపరుడైన జగన్ తో కేంద్రం చేతులు కలిపిందని చంద్రబాబు అన్నారు