రేపు ఢిల్లీకి బాబు: బీజేపీయేతర పార్టీలతో కీలక భేటీ
దేశంలో బీజేపీయేతర పార్టీలతో కూటమిని ఏర్పాటు కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు
అమరావతి: దేశంలో బీజేపీయేతర పార్టీలతో కూటమిని ఏర్పాటు కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు. డిసెంబర్ 10వ తేదీన చంద్రబాబునాయుడు ఢిల్లీలో బీజేపీయేతర పార్టీలతో న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకుగాను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నారు. గత నెలలో చంద్రబాబునాయుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. జెడీ(ఎస్), తృణమూల్ కాంగ్రెస్ , డీఎంకే చీఫ్ స్టాలిన్లతో చంద్రబాబునాయుడు ఇప్పటికే చర్చించారు. ఢిల్లీలో కూడ పలు పార్టీలతో చర్చించారు.
ఈ కూటమికి దిశా, దశ నిర్ధేశించేందుకు బీజేపీయేతర పార్టీలు సమావేశం కానున్నాయి. ఈ కూటమి ఎజెండాతో పాటు భవిష్యత్ కార్యాచరణను నిర్ధేశించుకోనున్నారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. డిసెంబర్ 11వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తోంది.. బీజేపీయేతర పార్టీలు ఎన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తోందోననే విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బీజేపీ ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సాధిస్తే ఈ కూటమి ఏర్పాటుపై అంత సానుకూల ప్రభావం ఉండకపోవచ్చే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీయేతర పార్టీలు విజయం సాధిస్తే కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు మరింత ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది.