ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు.. రిమాండ్ను సవాలు చేస్తూ పిటిషన్..!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడకు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తాజాగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణకు రానుంది.
ఇదిలాఉంటే, చంద్రబాబు నాయుడు హౌస్ రిమాండ్ పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈరోజు తీర్పును వెలువరించనుంది. చంద్రబాబు హౌస్ రిమాండ్కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాదులు కోరుతున్నారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారని.. ఆయనకు జైలులో ప్రమాదం ఉందని సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా అన్నారు. ఆయనకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. హౌస్ రిమాండ్కు సంబంధించి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావించారు.
అయితే చంద్రబాబుకు హౌస్ రిమాండ్ను సీఐడీ తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుకు ఇంట్లో కంటో జైలులో భద్రత ఉంటుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తి స్థాయి భద్రతను కల్పించినట్టుగా చెప్పారు. జైలు లోపల, బయట పోలీసుల భద్రత ఉందని తెలిపారు. అవసరమైతే వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును చంద్రబాబు కేసుకు ముడిపెట్టవద్దని అన్నారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ డిస్మిస్ చేయాలని కోరారు. రాజమండ్రి జైలులో తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డీజీ నుంచి వచ్చిన లేఖను కూడా కోర్టుకు మసర్పించారు.
సోమవారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. సోమవారం సాయంత్రం వాదనలు ముగియగా.. న్యాయమూర్తి మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెల్లడించనున్నట్టుగా తెలిపారు.