Konijeti Rosaiah Death: ఆర్థిక మంత్రిగా అద్భుతమైన సేవలు అందించారు.. రోశయ్య మృతి పట్ల చంద్రబాబు సంతాపం
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై (Konijeti rosaiah death) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై (Konijeti rosaiah death) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రోశయ్య మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపారు. ఆంధ్రోద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించిన రోశయ్యగారు ఐదు దశాబ్దాల పాటు ఎంతో అనుభవాన్ని గడించారని గుర్తుచేసుకున్నారు. సుదీర్ఘకాలం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అద్భుతమైన సేవలు అందించారని కొనియాడారు. సౌమ్యుడిగా, నిరాడంబరునిగా పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుపోతూ చిత్తశుద్ధితో రోశయ్య పనిచేశారని తెలిపారు. ప్రజలకు సేవలందించిన రోశయ్యగారి మృతి దేశ రాజకీయాలకు తీరని లోటని చెప్పారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రోశయ్య మృతి బాధాకరం.. సాకే శైలజానాథ్
రోశయ్య మృతి బాధాకరం అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ (sake sailajanath condolence on rosaiah death) అన్నారు. కొణిజేటి రోశయ్య మృతి కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని అన్నారు. రోశయ్య ఆత్మకు సద్గతులు కలగాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. రోశయ్య మరణంతో గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆదర్శవాదిని కోల్పోయామని శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రోశయ్య అజాత శత్రువుగా రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడని అన్నారు.
Also read: Konijeti Rosaiah Death: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత
రోశయ్య ఆకస్మిక మరణం బాధకరం.. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా సేవలందించిన కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణం చాలా బాధాకరమని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి (kona raghupathi condolence on rosaiah death) అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రోశయ్య మరణం సమకాలిక రాజకీయాలకు తీవ్ర మైన నష్టం..
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి సమకాలిక రాజకీయాలకు తీవ్రమైన నష్టమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు (somu veerraju) అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన నిర్వర్తించిన పాత్రను వర్ణించలేమని చెప్పారు. పలు ప్రధాన శాఖలలో మంత్రిగా పనిచేసిన రోశయ్య తనకంటూ ఒక గుర్తింపును పొందారని గుర్తుచేసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా అత్యుత్తమ సేవలు అందించారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రోశయ్య కన్నుమూత..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.