చంద్రబాబు ఎన్నికల్లో ఎంతో నేర్పు ప్రదర్శించారు. మూడు రకాలుగా మేనేజ్ చేశాడు. పోల్, పోలిటికల్, పబ్లిక్ మేనేజ్ మెంట్లను బాగా మేనేజ్ చేశాడు.

నంద్యాల‌, కాకినాడ‌లో టీడీపీ గెలుపుకు ప్ర‌ధాన కారణం పోల్‌, పొలిటికల్‌, పబ్లిక్‌ మేనేజ్‌మెంట్లని వైసీపీ ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు అన్ని వ‌ర్గాల‌ను ఎంతో నేర్పుగా మేనేజ్ చేశార‌ని ఆరోపించారు. అందుకే టీడీపీకి గెలుపు సాధ్య‌మైంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. శ్రీకాకుళంలో వైసీపీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 


నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక‌ముందు ఒక్క అభివృద్ది ప‌ని కూడా అక్క‌డ జ‌ర‌గ‌లేద‌న్నారు. నోటిఫికేష‌న్ రావడానికి వారం రోజుల ముందు 2500 ఇళ్లు మంజూరు చేశార‌న్నారు. వీటితో పాటు, 6 వేల ట్రాక్టర్లు పంపిణీ చేశారని, మ‌రో 3 వేల మందికి అదనంగా పెన్షన్లు, 4 వేల మందికి తెల్లకార్డులు, 2 వేల మంది విద్యార్థులకు కంప్యూటర్లు ఇచ్చారన్నారు. రూ. 1200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని ధ‌ర్మాన తెలిపారు. టీడీపీని గెలిపించకుంటే పనులు ఆగిపోతాయని ప్ర‌జ‌ల‌ను భయపెట్టారని ఆయ‌న‌ ఆరోపించారు. రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాలు వెనక్కు తీసుకుంటామని బెదిరించారని దుయ్యబట్టారు. ఇలా అన్ని ర‌కాలుగా మేనేజ్‌మెంట్లు చేసి నంద్యాల ఉప ఎన్నికలో గెలిచారని అన్నారు. 

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో చంద్రబాబు నైతికంగా గెలవలేదన్నారు. ఒకవేళ నిజంగా గెలిచామని నమ్మకముంటే పార్టీ ఫిరాయించి టీడీపీ దగ్గరున్న 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని ధ‌ర్మాన ప్ర‌సాధ రావు సవాల్‌ విసిరారు. 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి....