అమిత్ షా కుట్రలు సాగవు: మోడీ వీడియో ప్లే చేసి చంద్రబాబు అటాక్
కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు.
విజయవాడ: కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో ప్లే చేసి ఆ మాటలు వింటుంటే బాధ కలగడం లేదా, ఆవేశం రావడం లేదా అని ఆయన అడిగారు.
మంగళవారం టీడీపి మహానాడులో ఆయన ప్రసంగించారు. గుజరాత్ లో విగ్రహానికి నిధులు ఇస్తారు గానీ మనకు ఇవ్వరని ఆయన అన్నారు. గుజరాత్ కు ఇస్తారు గానీ ఎపికి ఇవ్వరని ఆయన అన్నారు.
మన రాజధానికి నిధులు ఇవ్వడానికి కేంద్రానికి చేతులు రావడం లేదని దుయ్యబట్టారు. హైదరాబాదును అద్భుత నగరంగా తీర్చిదిద్దిన ఘనత మనదేనని, హైదరాబాదును అభివృద్ధి చేసినట్లే అమరావతిని చేస్తానని ఆయన అన్నారు. గుజరాత్ లో నగర నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తోంది గానీ మనకు ఇవ్వడం లేదని అన్నారు.
బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాటలు ఎవరూ నమ్మరని, ఆయన కుట్రలు ఎపిలో సాగవని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది నెలల్లో అసెంబ్లీని నిర్మించామని ఆయన చెప్పారు.
కనకదుర్గ ఆలయం వద్ద ఫ్లై ఓవర్ మన వల్లనే ఆగిపోయిందని సాక్షిలో తప్పుడు వార్తలు రాయించారని ఆయన ఆరోిపంచారు. ప్రజలను మభ్య పెట్టడానికి తప్పుడు వార్తలు రాస్తున్నారని, వారి కుట్రలు అర్థమయ్యాయని, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని ఆయన అన్నారు.
అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని, జగన్ అడిగితే సెంట్ భూమి కూడా ఇచ్చేవారు కారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రజలు రూ.75 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. అమరావతికి మరో నగరం సాటి రాదని అన్నారు.
బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై కూడా చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. వైసిపిలోకి వెళ్లాలని అన్ని రెడీ చేసుకున్నారని, ఆస్పత్రిలో చేరి ఆ తర్వాత బిజెపి అధ్యక్షుడయ్యాడని, ఇప్పుడు బిజెపికి అద్దె మైకుగా వైసిపికి సొంత మైకుగా పనిచేస్తున్నాడని ఆయన కన్నాపై విరుచుకుపడ్డారు.