ఢిల్లీలో ఇరుక్కుపోయిన టిడిపి ఎంపిలు
వైసిపిల నిరాహారదీక్ష టిడిపి ఎంపిల చావుకొచ్చింది. వైసిపి ఎంపిల నిరాహారదీక్ష ముగిసేవరకూ టిడిపి ఎంపిలను కూడా ఢిల్లీలోనే ఉండి ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉండాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు.
వైసిపి ఎంపిల దీక్షలను చంద్రబాబు నిసితంగా పరిశీలిస్తున్నారు. దాంతో ఎంపిలను కూడా వారి దీక్షలపై కన్నేసుండాలంటూ చెప్పారు. వైసిపి ఎంపిల దీక్షలు మహా అయితే మరో నాలుగు రోజులుంటాయన్నది చంద్రబాబు అంచనా.
ఎందుకంటే, దీక్ష మొదలైన రెండు రోజులకే నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. దాంతో మేకపాటిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఇక, తిరుపతి ఎంపి వరప్రసాద్ కూడా కొద్దిపాటి అనారోగ్యం మొదలైనట్లు సమాచారం.
ఇక, అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి యువకులు కాబట్టి ప్రస్తుతానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. ఏదేమైనా శాంతిభద్రతల పేరుతో మరో నాలుగు రోజుల్లో నిరాహార దీక్ష శిబిరాన్ని ఎత్తేయచ్చని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
కాబట్టి వైసిపి దీక్ష ముగిసేవరకూ ఏ ఒక్క ఎంపిని కూడా ఢిల్లీ వదలొద్దని స్పష్టంగా చెప్పారు. అప్పటి వరకూ ఎంపిలను ఏదో ఓ ఆందోళన చేస్తూనే ఉండాలని చెప్పారు చంద్రబాబు. దాంతో ఏం చేయాలో టిడిపి ఎంపిలకు దిక్కు తెలీటం లేదు.
వైసిపి ఎంపిలు ఆందోళన చేస్తుంటే టిడిపి ఎంపిలు రాష్ట్రానికి తిరిగొచ్చేస్తే పార్టీకి చెడ్డపేరొస్తుందన్నది చంద్రబాబు భయంలా ఉంది. ఆందోళనల పేరుతో పార్లమెంటులొ ఉండే పరిస్ధితి లేదు. కేంద్రమంత్రులను ఎవరినీ కలవలేరు. ప్రధానమంత్రి అపాయిట్మెంట్ ఇవ్వరు. రాష్ట్రపతిని కలిసినా ఉపయోగం ఉండదు.
ఇక మిగిలిది ఒక్క ఉపరాష్ట్రపతి మాత్రమే. ఆయన్ను కలిసినా వచ్చే ఉపయోగమేమీ లేదు. దాంతో ఏ విధమైన ఆందోళనలు చేయాలో తెలీటం లేదు.