చంద్రబాబు అరెస్టు అక్రమం కాదు.. అనివార్యమైన అరెస్ట్.. అంబటి రాంబాబు
చంద్రబాబు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని ఎల్లో మీడియా భావించింది.. ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే మా పార్టీకే నష్టం అనుకుంది. కానీ అవేమీ జరగవు అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

అమరావతి : టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అక్రమంగా అరెస్టు చేశారని గగ్గోలు పెడుతున్నారని.. అయితే చంద్రబాబు అరెస్టు అక్రమం కాదని.. అనివార్యమైన అరెస్ట్ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అరెస్టు చేయడంతో సింపతి వస్తుందని ఎల్లో మీడియా, టిడిపి చూసిందన్నారు. చంద్రబాబుని అరెస్టు చేస్తే కక్షసాధింపు చర్యగా చూస్తారని అనుకుంటారని భావించారు. కానీ అవేమీ జరగలేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
భారీగా అక్రమాలకు పాల్పడిన చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ కేసులో పనిచేస్తున్న సిఐడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల కేసుకు అనుగుణంగానే వారు వ్యవహరించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించారని.. అందుకే అరెస్టు అయ్యారని ఆయన విరుచుకుపడ్డారు.
చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం: ఏపీ సర్కార్పై రాఘవేంద్రరావు ఫైర్
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. కానీ, ఇంకా ఆయన మీద అనేక కేసుల్లో విచారణ జరుగుతుందని తెలిపారు. రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో కూడా చంద్రబాబుపై విచారణ జరుగుతుందన్నారు. చాలా లోతుగా విచారణ జరిగిందని.. ఆ విచారణలో చంద్రబాబు షెల్ కంపెనీలకు డబ్బు తరలించి తర్వాత తన ఖాతాలో వేసుకున్నట్లు తేలిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగస్వామ్యమైన సిమన్స్ కంపెనీతో సంబంధం లేకుండానే చంద్రబాబు వ్యవహారం నడిపారన్నారు. ఇదే విషయాన్ని సీమెన్స్ కంపెనీ కూడా చెప్పిందన్నారు. రూ. 330కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచేశారని విమర్శలు గుప్పించారు. ఇంకా దీనిమీద మాట్లాడుతూ… ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడును అన్యాయంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడును ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తే వారికి సింపతి పెరుగుతుందని మాకు తెలియదా? అన్నారు.
వ్యవస్థలు సక్రమంగా తమ పని తాము చేసుకునేలా మేం ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. . చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ.. ఏమీ చేయలేరు.. అని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో సిమెన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. సిఎస్ కృష్ణారావుతో సహా ఫైనాన్స్ అధికారులు రూ.330 కోట్లు ఇవ్వడానికి వీలు లేదని నోట్ ఫైల్ రాశారు. నిధులు విడుదల కోసం చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసి విడుదల అయ్యేలా చేశారు. అంత దారుణమైన ఆక్రమాలు చేసుకుంటూ వెళితే అరెస్టులు చేయకూడదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారయ్యారని అన్నారు. చంద్రబాబును చట్టబద్ధంగానే సిఐడి అరెస్టు చేసిందని చెప్పుకొచ్చారు. రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ విచారణ కూడా జరుగుతోందని తప్పు చేస్తే ఎంతటి వారైనా న్యాయం, చట్టం చూస్తూ ఊరుకోదన్నారు. ఈ సాకుతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే అణిచేస్తాం.. రోడ్డుమీదికి వచ్చి గొడవలు చేస్తే సహించం అని హెచ్చరించారు.
కోర్టులో వాస్తవాలు ఒప్పుకోవాలి.. అంతేకానీ ప్రజలనుంచి దూరం చేయలేరంటూ పొలిటికల్ డైలాగులు చెప్తూ కూర్చుంటే కుదరవు... పవన్ కల్యాణ్ ఎగిరిపడుతున్నారని ప్రభుత్వ సొమ్మును కాజేసిన సంగతి తెలుసుకుని మాట్లాడాలన్నారు. కావాలంటే ఆ వాస్తవ వివరాలను ఆయనకు పంపిస్తాం అన్నారు.
ఒక దోపిడీ దారుడిని పవన్ కల్యాణ్ వత్తాసు పలుకుతున్నారు. షూటింగ్ లు వదిలి బయటికి రాలేని పవన్, ప్రజలను రోడ్ల మీదికి రమ్మంటారా? పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు ఇద్దరూ ఎవరికి ఆపద వచ్చినా పూలబొకేలు ఇచ్చుకుంటారు. ఇప్పుడు పవన్ ఓ పూలబొకేను చంద్రబాబుకు ఇస్తే మంచిదన్నారు. పవన్, చంద్రబాబు అవినీతి గోదావరిలోకి దిగాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదని అంబటి వ్యంగం చేశారు.