అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నుల శ్రీకార కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించేలా అమ‌రావ‌త‌నిని నిర్మిస్తామ‌ని తెలిపారు. మూడేళ్ల‌లోనే అమ‌రావ‌తిని నిర్మించి, మ‌ళ్లీ మోదీని ఆహ్వానిస్తామ‌ని చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు ఇంకా ఏమ‌న్నారంటే..   

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఒక మోడ‌ల్ అని చంద్ర‌బాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, స్వయం ఉపాధితో భారత్‌ వికాసం అన్నారు. ప్రధాని మోదీకి వ్యక్తిగతం కన్నా దేశమే ముఖ్యమ‌న్న చంద్ర‌బాబు కులగణన దేశంలో బిగ్‌ గేమ్‌ఛేంజర్‌ కాబోతోందన్నారు. 

మోదీ నాయకత్వంలో భారత్‌ గొప్ప దేశంగా అవతరించబోతోందన్న చంద్రబాబు.. వైసీపీ పాలనలో ఏపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింద‌న్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు.. కేంద్రం ఆక్సిజన్‌ ఇచ్చి ఊపిరిపోసింద‌న్నారు. గత ఐదేళ్లు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చార‌ని విమ‌ర్శించారు.  ఈ రోజు ఏపీ చరిత్రలో ఇవాళ లిఖించదగ్గ రోజని బాబు అభివ‌ర్ణించారు. 

ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే ప్రతిచర్యకు అండగా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో ఉగ్రదాడి అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో కూడా.. ప్రధాని మోదీ మన కోసం అమరావతికి వచ్చారుని, సరైన సమయంలో సరైన నేత భారత్‌కు ప్రధానిగా ఉన్నారన్నారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ప్రధాని కలిశానని, ఎప్పుడూ ఆహ్లాదంగా కనిపించే మోదీ.. చాలా గంభీరంగా కనిపించారన్నారు. 

ఉగ్ర‌వాదుల‌ను శిక్షించేందుకు దేశం మొత్తం మోదీ వెంట ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. మోదీ జీ హమ్ ఆప్ కే సాత్ హై! ఆంధ్రప్రదేశ్  కే పాంచ్  కరోర్  లోగ్  అంటూ హిందీలో మాట్లాడారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్న చంద్ర‌బాబు మోదీ ప్రధాని అయ్యాక ఐదో ఆర్థిక వ్యవస్థంగా అవతరించామ‌ని గుర్తు చేశారు.