సుబ్బయ్య హత్య: దిగొచ్చిన పోలీసులు.. ఎఫ్ఐఆర్లోకి ఎమ్మెల్యే, ఆయన బావమరిది
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సహా మరో ఇద్దరి పేర్లు చేర్చేందుకు పోలీసులు అంగీకరించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సహా మరో ఇద్దరి పేర్లు చేర్చేందుకు పోలీసులు అంగీకరించారు. ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చాలంటూ సుబ్బయ్య భార్య అపరాజిత డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రొద్దుటూరు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఆమె ఇదే విషయాన్ని చెప్పి తమకు న్యాయం చేయాలని కోరారు.
దీంతో లోకేశ్ సహా టీడీపీ నేతలు సుబ్బయ్య మృతదేహంతో ధర్నాకు దిగారు. ఆ ముగ్గురి పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేసే వరకు ప్రొద్దుటూరు వీడేదిలేదంటూ తేల్చి చెప్పారు.
అయితే మధ్యలో కలగజేసుకున్న డీఎస్పీ వచ్చి ఆందోళన విరమించాలని లోకేశ్ను కోరారు. దీనికి ఆయన ససేమిరా అనడంతో ఎట్టకేలకు 161 సెక్షన్ ప్రకారం ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లను ఈ కేసులో చేర్చుతున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం డీఎస్పీ ఆధ్వర్యంలో సుబ్బయ్య భార్య అపరాజిత దగ్గర వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం ఆ వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టుకు అందించనున్నారు. ఈ హత్య కేసుపై 15 రోజుల్లో విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ సమక్షంలో అపరాజితకు డీఎస్పీ హామీ ఇచ్చారు.