జగన్ పారాసిటమాల్ పై ప్రకటనపై బైరెడి శబరి వ్యాఖ్యలు, బెదిరింపులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ పారాసిటమాల్ ప్రకటనపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నట్లు బిజెపి నేత బైరెడ్డి శబరి రెడ్డి చెప్పారు. వైసీపీ నేతలపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలపై బిజెపి నాయకురాలు బైరెడ్డి శబరి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇదేమైనా నియంతృత్వమా, రాష్ట్రంలో అసలేం జరుగుతోందని ఆమె అడిగారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
తప్పుడు సమాచారం వస్తే డాక్టర్ గా సరిచేయాల్సిన బాధ్యత తనకు ఉందని ఆమె అన్నారు. పారాసిటమాలే కరోనాకు చికిత్స అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారని, అది జ్వరాన్ని మాత్రమే తగ్గిస్తుందని, కరోనా వైరస్ అంటే జ్వరం మాత్రమే కాదని, ఇతర ఇన్ ఫెక్షన్లు ఉంటాయని ఆమె అన్నారు.
అదే విషయాన్ని తాను చాలా మర్యాదగా చెప్పానని ఆమె అన్నారు. తాను ముందుకు వచ్చిన మాట్లాడడం తప్పా, తప్పు జరిగితే ప్రశ్నించకూడదని ఏమైనా చెప్పారా అని ఆమె అడిగారు. ఆరు గంటలకు ఒకసారి 650 గ్రాముల చొప్పున అంటే 24 గంట్లలో దాదాపు 2.5 కేజీల పారాసిటిమాల్ వేసుకోవాలని, ఇదేమైనా స్వీటా, మంచిది కాదని ఆమె అన్నారు.
పెద్ద స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రే అలా చెప్తే ప్రజలు నమ్ముతారని, ఇంత వరకు తాను రాజకీయం చేయలేదని, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడానని ఆమె అన్నారు. గౌరవంగా, బాధ్యతాయుతంగా మాట్లాడానని ఆమె చెప్పారు.
చెప్పులతో కొడుతామని బెదిరిస్తారా అని ఆమె వైసీపీ నేతలను అడిగారు. "మీ పార్టీకి చెందినవారి ఇళ్లలో కూడా స్త్రీలు ఉన్నారని, ఒక మహిళ గురించి అలా మాట్లాడకూదన్నది తెలియదా.... ఇలాంటి రౌడీలకు పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుంది. మంచి చెప్తే తప్పంటారా.. ఎందుకండి మీరు" అని అన్నారు.
"మహిళలపై విమర్శలు చేస్తే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలియదా, మహిళల గురించి ఒక్క మాట మాట్లాడినా కామెంట్ చేసినా.. ఐపిఎస్ సెక్షన్ 509 ప్రకారం మూడేళ్లు జైలు శిక్ష.. ఇదంతా అవగాహన లేదా.. దమ్ముంటే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడండి... మీ కార్యకర్తలకు నేర్పించండి" అని ఆమె అన్నారు.
"మహిళలకు మాట్లాడే హక్కు లేదంటే.. మీ పార్టీలోని మహిళా ఎమ్మెల్యేలను, మంత్రులను రాజీనామాలు చేయించండి. రాజకీయాలు కొత్తేమీ కాదు. మా తాతల నుంచి రాజకీయాలను ఎన్నో చూశాం. డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. నాకే ఇంత బెదిరింపులు వస్తుంటే సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది" అని ఆమె అన్నారు.
"సీఎం జగన్ గారూ.. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. లేదంటే నేనే బిజెపి నేతగా స్వయంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది" అని ఆమె అన్నారు.