ఎలక్షన్ మూడ్ లో అధికార వైసిపి... బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి కీలక బాధ్యతలు
వైసిపి పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్దం అవుతోంది. ఇందులో భాగంగానే పార్టీని ప్రక్షాళన చేసి సమర్థులు అనుకున్నవారికే కీలక బాధ్యతల అప్పగిస్తున్నారు ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండుమూడు నెలల సమయం వుంది... కానీ ప్రధాన పార్టీలన్నీ ఇప్పటినుండే ఎన్నికలకు సంసిద్దం అవుతున్నాయి. ఈ విషయంలో అధికార వైసిపి కాస్త ముందుందని చెప్పాలి. ఇప్పటికే ప్రతిపక్షాలను దెబ్బతీసే వ్యూహాలతో ముందుకు వెళుతోంది వైసిపి. ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకునే పనిలో పడింది అధికార పార్టీ. ఇందులో భాగంగానే పార్టీలో అలజడి రేగుతుందని తెలిసినా పలు నియోజకవర్గాల్లో కొత్తవారిని ఇంచార్జీలను నియమిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. తాజాగా వైఎస్సార్ సిపి యువజన విభాగం నూతన కమిటీని ఏర్పాటుచేస్తూ మరో కీలక ప్రకటన చేసారు.
వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నూతన యువజన విభాగం కమిటీని ఏర్పాటుచేసారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి నే తిరిగి నియమించింది వైసిపి. అలాగే వివిధ జిల్లాలకు, సామాజిక వర్గాలను దృష్టిలో వుంచుకుని యువజన కమిటీలో ఇతర పదవులను కేటాయించారు. ఈ మేరకు యువజన కమిటీలో చోటు దక్కించుకున్నవారి పేర్లను వైసిపి కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.
వైసిపి యువజన విభాగం నూతన కమిటీ :
వైసిపి యువజన కమిటీ అధ్యక్ష బాధ్యతల మళ్ళీ బైరెడ్డికే దక్కగా ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్ రెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, తప్పెట్ల సాహిత్ రెడ్డి నిమమితులయ్యారు. ఇక రాష్ట్రం మొత్తాన్ని ఎనిమిది జోన్లుగా విభజించి వాటికి ఇంచార్జీలను నియమించారు. అలాగే ముగ్గురు అధికార ప్రతినిధులు, అయిదుగురు ప్రధాన కార్యదర్శులతో పాటు కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు... ఇలా మొత్తం 64 మందితో కూడిన యువజన కమిటీని వైసిపి ప్రకటించింది.