బోండా ఉమ వాట్సాప్ సాక్షిగా చెప్పేశాడు
ఉమ తన అసంతృప్తిని ఈ విధంగా పార్టీకి చేరవేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ మంత్రివర్గ విస్తరణ టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆగస్టు సంక్షోభం కాస్త ముందే వచ్చేలా కనిపిస్తోంది.
విస్తరణ నేపథ్యంలో అలకబూనిన సీనియర్ నేతలను అదిరించి బెదిరించి బుజ్జగించి తన దారికి తెచ్చుకునే పనిలో ఇప్పుడు బాబు బిజీగా ఉన్నారు.
ఉదయం మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో రాజీనామాకు తెర తీసిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఆ తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు.
అయితే ఆయన తన అసంతృప్తిని మరో విధంగా వెళ్లగక్కారు. సాయంత్రం తన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఉమ ఓ సంచలన ప్రకటన చేశారు.
ఇకపై టీడీపీ తరఫున తాను ఏ టీవీ చానెల్ లో చర్చకు రానని, అసలు టీడీపీ తరఫున ఏ పత్రికకు ఇంటర్య్వూ ఇచ్చేదే లేదని మీడియా ప్రతినిధులు మెసేజ్ లు పెట్టారు. సోమవారం నుంచే తన ప్రకటన అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.
రెండున్నరేళ్లుగా తనకు సహకరించిన మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అయితే బాబు తో మాట్లాడిన తర్వాత మీడియా ముందు చాలా హుందాగా టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని ప్రకటించిన ఉమ ఆ తర్వాత ఫ్లేటు ఫిరాయించడంతో బాబు అండ్ కో తలపట్టుకుంటున్నారు.
అయితే ఉమ తన అసంతృప్తిని ఈ విధంగా పార్టీకి చేరవేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీ క్రమశిక్షణ దాటకుండానే తమ నేత అసంతృప్తిని ఈ విధంగా తెలియజేస్తున్నాడని వివరణ ఇస్తున్నాయి.