ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే.. అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే దాడిపై వైఎస్సార్సీపీ ఆగ్రహం
Amaravati: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ.. అసెంబ్లీలో మరో రణరంగాన్ని తలపించింది. వాయిదా తీర్మానం విషయంలో ఇరు పార్టీల నాయకులు ఘర్షణకు దిగారు. అయితే, తమపై దాడి చేశారంటే.. వారే తమపై దాడి చేశారంటూ వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు.
AP Assembly Mlas Clash: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ.. రణరంగాన్ని తలపించింది. వాయిదా తీర్మానం విషయంలో ఇరు పార్టీల నాయకులు ఘర్షణకు దిగారు. అయితే, తమపై దాడి చేశారంటే.. వారే తమపై దాడి చేశారంటూ వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సభలో సభాపతి, దళిత ఎమ్మెల్యేలపై టీడీపీ సభ్యులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామనీ, ఈ రోజును ప్రజాస్వామ్యానికి బ్లాక్ డేగా వైఎస్సార్సీపీ అభివర్ణించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
సోమవారం మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాంపై దాడి, దళిత సభ్యులపై టీడీపీ సభ్యులు దాడి చేసిన సంఘటనలను వివరించారు. ఎమ్మెల్యే వీఆర్ ఎలిజా మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ పై టీడీపీ సభ్యులు సామూహికంగా దాడి చేశారనీ, టీడీపీ ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు సభా నైతికతను గాలికి వదిలేసి ఒక పథకం ప్రకారం రోజువారీగా సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
టీడీపీ కుట్ర ప్రకారమే ముందు వరుసలో ఉన్న బాల వీరాంజనేయ స్వామి బెదిరిస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి తనపై దాడి చేశారన్నారు. స్పీకర్ పై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా టీడీపీ ఎమ్మెల్యే నన్ను పక్కకు తోసేశారు. అప్పుడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు జోక్యం చేసుకున్నారని, కానీ తనపై కూడా వీరాంజనేయ స్వామి దాడి చేశారని, దళిత ఎమ్మెల్యేపై దాడి చేసినందుకు తప్పు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఎలిజా డిమాండ్ చేశారు.
అనంతరం సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ సభలో జరిగిన ఘటనలకు చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా తనపై దాడి చేశారని ఆయన అన్నారు. దీన్ని బ్లాక్ డేగా అభివర్ణించిన సుధాకర్ బాబు.. చంద్రబాబు వేసిన ప్లాన్ ప్రకారమే టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిరోజూ పేపర్లు విసిరి, చింపి, ప్లకార్డులు ముఖంపై చూపిస్తూ బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ పట్ల అగౌరవాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియా వేదికగానూ వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.