కౌంటర్:టిడిపి తీరును నిరసిస్తూ బిజెపి ధర్నా, ఇంటింటి ప్రచారం
బాబుకు బిజెపి కౌంటర్
విజయవాడ: ఏపీలో టిడిపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు వివరించాలని బిజెపి భావిస్తోంది.ఈ మేరకు నాలుగేళ్ళుగా రాష్ట్రానికి కేంద్రం నుండి ఏ మేరకు సహాయం చేసిన విషయాలను ప్రజలకు వివరించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఇంటింటికి బిజెపి నేతలు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీ రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని టిడిపి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. బిజెపి అన్యాయం చేసినందునే ఎన్డీఏ నుండి వైదొలగాల్సి వచ్చిందని టిడిపి నేతలు చెబుతున్నారు.
వైసీసీ, బిజెపి, జనసేనలు కుమ్మక్కయ్యాయని టిడిపి నేతలు ఏపీలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని టిడిపి ప్రచారాన్ని ఎండగట్టాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. విజయవాడలో బిజెపి ముఖ్య నేతల సమావేశం ఆదివారం నాడు జరిగింది.
ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం బిజెపిపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎలా ఎండగట్టాలనే విషయమై చర్చిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ జూన్ 12వ తేదిన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.
అంతేకాదు రాష్ట్రానికి నాలుగేళ్ళుగా కేంద్రం నుండి వచ్చిన నిధులను ప్రతి ఇంటింటికి వివరించాలని బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు.ఈ మేరకు పార్టీ యంత్రాంగమంతా ఇంటింటికి వెళ్ళి ఈ విషయమై ప్రచారం చేయనున్నారు. ఏపీకి కేంద్రం నుండి నిధులిచ్చినా కేంద్రంపై టిడిపి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని ఆధారాలతో సహా వివరించాలని బిజెపి నేతలు భావిస్తున్నారు.