Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌తో చంద్రబాబు దోస్తీ క్లియర్: హరిబాబు

అవిశ్వాసంపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా  టీడీపీ తీరును  బీజేపీ ఎంపీ  హరిబాబు ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఆ పార్టీతో చేతులు కలపడాన్ని చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు.

Bjp MP Haribabu exposes TDP in Parliament

న్యూఢిల్లీ: అవిశ్వాసంపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా  టీడీపీ తీరును  బీజేపీ ఎంపీ  హరిబాబు ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఆ పార్టీతో చేతులు కలపడాన్ని చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు.

అవిశ్వాసంపై చర్చను పురస్కరించుకొని రాజకీయంగా టీడీపీపై హరిబాబు విమర్శలు ఎక్కుపెట్టారు.ఏపీ రాష్ట్రానికి నాలుగేళ్లపాటు బీజేపీ ఏ రకంగా నిధులను కేటాయించిందనే విషయాలను ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో రాజకీయంగా అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీపై విమర్శలను ఎక్కుపెటటారు.

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌పార్టీతో టీడీపీ ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసుకోవడాన్ని తాను చూసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకొనే హక్కు టీడీపీకి ఉందంటూనే  కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ కలవడంపై ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఏపీపై మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.  అందుకే తెలంగాణ నుండి 7 మండలాలలను ఏపీలో విలీనం చేసినట్టు ఆయన గుర్తు చేశారు.  ప్రత్యేక హోదా లేకున్నా  ప్రత్యేక ప్యాకేజీ రూపంలో  ఏపీకి కావాల్సిన నిధులను ఇస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఏపీని అన్ని రకాలుగా ఆదుకొనేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. అకౌంట్ నెంబర్ ఇస్తే సోమవారానికి నిధులను ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందని హరిబాబు చెప్పారు.  అయితే హరిబాబు ప్రసంగానికి  టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు.

ఏపీపై కాంగ్రెస్ పార్టీకి శ్రద్ధ ఉంటే ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టేదని ఆయన గుర్తు చేశారు.  14వ, ఫైనాన్స్ కమిషన్ సిఫారసు మేరకు  ఏపీ రాష్ట్రానికి రెవిన్యూలోటును భర్తీ చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. రూ.17500 కోట్లను రుణంగా ఇచ్చేందుకు  కేంద్రం అంగీకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు పరిశీలించాలని యూపీఏ ప్రభుత్వం చట్టంలో పొందుపర్చిందన్నారు. కానీ, ఫ్యాక్టరీ ఏర్పాటుకు  నివేదిక వ్యతిరేకంగా వచ్చిందన్నారు. కానీ, అందుకే టాస్క్‌పోర్స్ ‌ను ఏర్పాటు చేసిసట్టు ఆయన గుర్తు చేశారు. విశాఖకు రైల్వేజోన్ వచ్చి తీరుతోందని  హరిబాబు ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios