ఆ ఫోన్ రికార్డులతొనే బాబు గుట్టు రట్టు: జీవీఎల్
బాబుపై బిజెపి ఎంపీ సంచలన కామెంట్స్
అమరావతి: కేంద్రం నుండి తీసుకొన్న ప్రతి పైసాకు లెక్కలు
చెప్పాల్సిందేనని బిజెపి ఎంపీ, జీవీఎల్ నరసింహారావు
చెప్పారు. చంద్రబాబునాయుడు ప్రవర్తన ఊసరవెల్లికి కూడ
సిగ్గు తెచ్చేదిగా ఉందని ఆయన తీవ్ర విమర్శలు
గుప్పించారు.బిజెపితో పొత్తు కోసం టిడిపి ఎంత
తాపత్రయపడిందో ఫోన్ రికార్డులు బయటకు వస్తే
తేలుతాయన్నారు.
మహానాడు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా,
కొందరు టిడిపి నేతలు కేంద్ర ప్రభుత్వంపై బిజెపిపై చేసిన
విమర్శలపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు బుధవారం
నాడు స్పందించారు.
విజయవాడలో నిర్వహించింది మహనాడు కాదు, దగానాడు
అని ఆయన ఎద్దేవా చేశారు. గుజరాత్ రాష్ట్రానికి కేంద్రం పెద్ద
ఎత్తున నిధులను మంజూరు చేసిందని తప్పుడు ఆరోపణలు
చేశారని ఆయన చెప్పారు.2014కు ముందు కేంద్రంలో
అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ
ప్రభుత్వం మంజూరు చేసిన ప్రకారంగానే గుజరాత్ కు
ఇండస్ట్రీయల్ సిటీ డెలవప్ అవుతోందన్నారు.
కానీ, కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
తర్వాత ఏపీ రాష్ట్రంలో మూడు సిటీలను ఇండస్ట్రీయల్
సిటీలుగా డెవలప్ చేస్తున్నామని ఆయన చెప్పారు.
కేంద్రం గుజరాత్ రాష్ట్రానికి అదనంగా నిధులు ఇస్తూ ఏపీని
అన్యాయం చేస్తోందని చంద్రబాబునాయుడు తప్పుడు
ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.తప్పుడు ప్రచారం
చేసినందుకుగాను చంద్రబాబునాయుడు బహిరంగంగా
క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదా తన
వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్
చేశారు.
ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ ఇచ్చిన సమయంలో
ప్రత్యేక హోదా కంటే ఎక్కువ సాధించామని
చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొన్నారని ఆయన
చెప్పారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా కన్వీనర్
మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడని ఆయన చెప్పారు.
చంద్రబాబునాయుడు యూటర్న్, ట్విస్ట్ లు ఇస్తున్నారని
ఆయన చెప్పారు. అయితే బాబును ఏపీ ప్రజలు క్షమించరని
ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్రం ఇచ్చిన నిదుల్లో అనేక అవకతకవలకు ఏపీ సర్కార్
పాల్పడిందన్నారు. నిధులు ఖర్చు చేయకుండానే ఖర్చు
చేసినట్టుగా యూసీలు సమర్పించారని ఆయన
ఆరోపించారు.
ఏపీ చేసిన అవినీతిని తాము సమర్ధించేందుకు సిద్దంగా
లేమని చెప్పారు. ప్రతి పైసాకు లెక్కలు చెప్పాల్సిందేనని
ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని
నడుపుతున్నారా, మాపియా ప్రభుత్వాన్ని నడుపుతున్నారో
అర్ధం కావడం లేదని జీవీఎల్ నరసింహరావు చంద్రబాబుపై
తీవ్రంగా విరుచుకుపడ్డారు.
కేంద్రం నుండి వచ్చే నిధులను ఎన్నికల ఫండ్ గా
ఉపయోగించుకోవడం కోసం తాము సిద్దంగా లేమని ఆయన
చెప్పారు.
ఫోన్ రికార్డులతో బట్టబయలు
తమ పార్టీతో పొత్తు కోసం టిడిపి నేతలు ఏ రకంగా
తాపత్రయపడ్డారనే విషయమై ఫోన్ రికార్డులు బట్టబయలు
చేస్తాయని జీవీఎల్ నరసింహారావు చెప్పారు.2014
ఎన్నికలకు ముందు టిడిపి నేతలు తమ పార్టీ నేతలతో
చేసిన సంభాషణలను వింటే బిజెపితో పొత్తు కోసం ఏ
రకంగా ఆ పార్టీ ఆసక్తిని కనబర్చిందో అర్ధం
అవుతోందన్నారు.
.