బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు కీలక పదవి దక్కింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్.. సభకు సంబంధించిన అనేక కమిటీలను పునర్నిర్మించారు. అలాగే వాటికి నూతన అధ్యక్షులను నియమించారు. ఈ క్రమంలోనే సీఎం రమేష్‌ను కీలక పదవి వరించింది. 

బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు కీలక పదవి దక్కింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్.. సభకు సంబంధించిన అనేక కమిటీలను పునర్నిర్మించారు. అలాగే వాటికి నూతన అధ్యక్షులను నియమించారు. ఈ క్రమంలోనే సీఎం రమేష్‌ను కీలక పదవి వరించింది. రాజ్యసభ హౌసింగ్ కమిటీ చైర్మన్‌గా సీఎం రమేష్ నియమితులయ్యారు. మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్‌కు రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ పదవి లభించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌లను జారీ చేసింది. 

రాజ్యసభ హౌసింగ్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన సీఎం రమేష్.. రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పించే కీలక బాధ్యతలను సీఎం రమేశ్ పర్యవేక్షించనున్నారు. కొత్త సభ్యులకు బంగ్గాలను కేటాయించడం, పదవీకాలం పూర్తిచేసుకున్నవారి బంగ్లాను ఖాళీ చేయించడం కూడా ఈ కమిటీ బాధ్యతే. ఈ కమిటీలో తెలుగు ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్ (టీఆర్ఎస్), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వైసీపీ) సభ్యులుగా ఉన్నారు. ఇక, 2019 సార్వత్రికల ఎన్నికల అనంతరం సీఎం రమేష్.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం రమేష్.. ప్రస్తుత పదవీకాలం 2024 ఏప్రిల్ 2తో ముగియనుంది.

ఇదిలా ఉంటే.. రాజ్యసభ పిటిషన్‌ల కమిటీకి బీజేపీ ఎంపీ సుజీత్ కుమార్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ప్రభుత్వ హామీల కమిటీకి చైర్మన్‌గా డీఎంకే ఎంపీ ఎం తంబిదురై, కమిటీ ఆన్ పేపర్స్ లెయిడ్ ఆన్ ది టేబుల్ కు చైర్మన్‌గా బీజేపీ ఎంపీ కామాఖ్య ప్రసాద్ తాసా నియమితులయ్యారు. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి రాజ్యసభలో బీజేపీ చీఫ్ విప్‌గా ఉన్న లక్ష్మీకాంత్ బాజ్‌పేయి అధ్యక్షత వహించనున్నారు.

ఇక, జవదేకర్ అధ్యక్షతన పునర్నిర్మించిన ఎథిక్స్ కమిటీలో.. రాజ్యసభలో టీఎంసీ ఫ్లోర్ లీడర్ డెరెక్ ఓబ్రెయిన్, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు.