అదో బూతు పాలసీ...
- ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీ ఏ ఒక్కరికీ ఆమోదయోగ్యం కాదన్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్టుషాపులను తొలగిస్తామని సిఎం చెప్పారంటే ఇప్పటికైతే బెల్టుషాపులున్నాయని అంగీకరించినట్లే కదా అంటూ విష్ణు పెద్ద లా పాయింటే లాగారు.
- మహిళలు కన్నెర్రచేసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదంటూ రాజుగారు జోస్యం కూడా చెప్పారండోయ్.
ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్యంపాలసీ ఓ బూతుపాలసీ అట. ఇది వైసీపీ నేతలు చెప్పేది కాదు. స్వయంగా మిత్రపక్షమైన భాజపా శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు చేసిన ఆరోపణ. ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యంపాలసీ ప్రజాకంటక పాలసీ అంటూ మండిపడ్డారు. ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు మద్యంపై మండిపడుతున్నారు. మహిళ ఆందోనలకు జడిసే బెల్టుషాపులను ఎత్తేస్తామని చంద్రబాబునాయుడూ ప్రకటించారు రెండు రోజుల క్రితం. అదే సమయంలో భాజపా కూడా గొంతువిప్పటం గమనార్హం. అదే విషయమై విష్ణు కూడా మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీ ఏ ఒక్కరికీ ఆమోదయోగ్యం కాదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్టుషాపులను తొలగిస్తామని సిఎం చెప్పారంటే ఇప్పటికైతే బెల్టుషాపులున్నాయని అంగీకరించినట్లే కదా అంటూ విష్ణు పెద్ద లా పాయింటే లాగారు. దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాలు, స్కూళ్ళకు వందమీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు ఉండకూడదన్నది ప్రభుత్వ నిబంధనగా చెప్పారు. అదే ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు ఆలయాలకు సమీపంలో మద్యం షాపులు, బార్లు ఉండవచ్చా? అక్కడికి వెళ్ళే వాళ్లు మనుషులు కారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసారు. ప్రతీరోజు వేలాదిమంది తిరిగే విశాఖ బీచ్ రోడ్డులోని కాళీమాత గుడిపక్కనే సాగర్ పేరుతో వైన్ షాపు ఏర్పాటు చేసినట్లు రాజు వాపోయారు. మహిళలు కన్నెర్రచేసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదంటూ రాజుగారు జోస్యం కూడా చెప్పారండోయ్.