తిరుమలలో డిక్లరేషన్పై వ్యాఖ్యలు: కొడాలి నానిపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు
వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని తిరుమల ఆలయంపై చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఈ క్రమంలో మంగళవారం బీజేపీ నేతలు నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు
వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని తిరుమల ఆలయంపై చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఈ క్రమంలో మంగళవారం బీజేపీ నేతలు నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని.. డిక్లరేషన్ విషయంపై కొడాలి నాని వ్యాఖ్యలు సరికావని వారు మండిపడ్డారు.
Also Read:నేనే కాదు, మురళీమోహన్ కూడా: అయ్యప్ప మాలలో చెప్పులు వేసుకోవడంపై మంత్రి అవంతి
చట్టాలు చేసే మంత్రులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని.. నాని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ మేరకు కొడాలి నానిపై ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాశ్ రెడ్డి తిరుపతి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.
తన కేబినెట్లోని వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి జగన్దే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కొడాలి నాని వ్యాఖ్యలపై అర్చక, హిందూ సంఘాలు సైతం మండిపడ్డాయి.
Also Read:హిందూ సంప్రదాయాలను కాలరాయడమే వైసీపీ ధ్యేయమా.. కొడాలి నాని కామెంట్స్ పై సీరియస్
బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు సరికాదని.. వెంటనే నాని క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. డిక్లరేషన్ అనేది తిరుపతి ఆలయంలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయమని వారు గుర్తు చేశారు.
తిరుమలలో ఇతర మతాలకు చెందినవారు డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలోకి ప్రవేసించాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనని వైఎస్ జగన్ ఎందుకు పాటించలేదని విమర్శలు వైసిపి మంత్రి కొడాలి నాని ఇటీవల వివాదభరితంగా సమాధానం ఇచ్చారు.
నాని వ్యాఖ్యలు ప్రస్తుతం హిందూ వర్గాలలో ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. తాజాగా బ్రాహ్మణ సంఘ నాయకుడు వేమూరి ఆనంద సూర్య ఓ ప్రకటనలో కొడాలి నానిపైఎం వైసిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేమూరి ఆనంద సూర్య మాట్లాడుతూ.. ఎన్నికలలో ప్రజాభిప్రాయం మేరకు గెలిచి పదవులు అనుభవిస్తున్న మంత్రులు.. సంస్కృతి సంప్రదాయాలను సమంగా గౌరవించాలనే ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.
ముఖ్యంగా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి సన్నిధి గురించి ఆది నుంచి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి.
Also Read:ఆయన దద్దమ్మ.. జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే: లోకేశ్పై కొడాలి నాని ఫైర్
తిరుమలను సందర్శించే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చి ఆలయాల్లోకి వెళ్లాలనే నిబంధన ఉన్నా.. జగన్ పాటించలేదనే విమర్శకి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని స్పందించిన విధానం చూసి సభ్యసమాజం తలదించుకుంటోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆచార సాంప్రదాయాల గూర్చి, హిందూ భక్తుల మనోభావాల గూర్చి మంత్రి వ్యాఖ్యలు హేయం. హుందాగా నడుచుకోవాల్సిన మంత్రులు సహనం కోల్పోయి మాట తూలడం అభ్యంతర కరం.