జగన్ పాదయాత్ర భేష్: కృష్ణంరాజు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బీజేపీ నేత కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: పొత్తుల తర్వాత బీజేపీని ఇబ్బంది పెట్టడం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అలవాటేనని మాజీ కేంద్ర మంత్రి , బీజేపీ నేత కృష్ణంరాజు విమర్శించారు. గతంలో మాదిరిగానే చంద్రబాబునాయుడు 20 గంటలకుపైగా ఇప్పుడు కూడ కష్టపడుతున్నాడని చెప్పారు. అయితే అప్పుడేమో ప్రజల కోసం కష్టపడ్డాడని, ఇప్పుడేమో అబద్దాలను నిజం చేయడం కోసం కష్టపడుతున్నాడని ఆయన ఆరోపించారు.
సోమవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్తో మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ తర్వాత ఇబ్బంది పెట్టడం చంద్రబాబునాయుడే చెల్లిందన్నారు. గతంలో ఇదే తరహలో వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో అంచనాలను ఇష్టారీతిలో పెంచుకొంటూపోయారని ఆయన విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహరం కోసం తొలుత రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత దాన్ని రూ.30 వేల కోట్లకు పెంచారని ఆయన చెప్పారు.
అసాధారణంగా పోలవరం నిర్వాసితుల పరిహరం ఎందుకు పెరిగిందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.గత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు 600 హమీలు ఇచ్చారని చెప్పారు. అయితే ఇందులో ఎంతమంది హమీలను అమలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడే పరిస్థితులు లేవన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. కానీ, ఆ పార్టీ పుంజుకొనే పరిస్థితులు కన్పించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబునాయుడు గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేశాడని ఆయన చెప్పారు. ఆనాడు రోజూ 20 గంటలకు పైగా పనిచేశాడని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడ బాబు రోజూ 20 గంటలకు పైగా పనిచేస్తున్నాడని చెప్పారు.
అయితే ప్రస్తుతం అబద్దాలను నిజం చేయడం కోసం, నిజాలను అబద్దాలు చేయడం కోసం బాబు కష్టపడుతున్నాడని కృష్ణంరాజు విమర్శలు చేశారు. మోడీపై, బీజేపీపై విమర్శలు చేసేందుకే ప్రస్తుతం చంద్రబాబునాయుడు పనిచేస్తున్నాడన్నారు.
వైఎస్ మాదిరిగానే జగన్ కూడ పాదయాత్ర చేస్తున్నారని కృష్ణంరాజు చెప్పారు. జగన్ పాదయాత్ర బాగుందన్నారు. తెలుగు ప్రజలకు న్యాయం చేసేందుకు మోడీ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.