చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆకర్ష్ పథకానికి తెరలేపిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు మొదలయ్యాయి.

చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆకర్ష్ పథకానికి తెరలేపిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు మొదలయ్యాయి. పార్టీ నేతలు కూడా అవుననే అంటున్నారు లేండి. జిల్లాలోని కొందరు నేతలను కలవటమే లక్ష్యంగా పెట్టుకుని జాబితా కూడా సిద్ధం చేసుకుందట. అందులో భాగమే చిత్తూరు మాజీ ఎంఎల్ఏ సికె బాబును పురంధేశ్వరి కలిసిన విషయం అందరకీ తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పురంధేశ్వరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిసారట. కిరణ్ భాజపాలో చేరుతారని ఒకసారి, టిడిపిలోకి దూకేస్తారని ఇంకోసారి కాదు కాదు కాంగ్రెస్ లోకే మళ్ళీ వెళ్ళిపోతారని...ఇలా అనేక ప్రచారాలు జరిగాయి.

తాము ఏ పార్టీలోకి వెళ్ళేది త్వరలో మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటిస్తామని కిరణ్ తమ్ముడు చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దాంతో కిరణ్ చేరికల ఊహాగానాలకు అప్పట్లో తెరపడింది.

తాజాగా పురంధేశ్వరి, కిరణ్ భేటీ జరిగిందన్న ప్రచారం మళ్ళీ మొదలైంది. వీరిద్దరే కాకుండా జిల్లాలోని పలువురు నేతలను కలవటమే లక్ష్యంగా పురంధేశ్వరి జిల్లాలో టూర్ చేస్తున్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలోకి వెళ్ళలేక, టిడిపిలో ఇమడలేక ఇబ్బందులు పడుతున్న మాజీ కాంగ్రెస్ నేతలను భాజపా కలవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నియోజకవర్గాల వారీగా నేతల జాబితాను కూడా భాజపా సిద్ధం చేసుకుని మరీ పురంధేశ్వరి కలుస్తుండటంపై జిల్లాలో చర్చ మొదలైంది. అందులోనూ చంద్రబాబు సొంత జిల్లాలోనే పురంధేశ్వరి టూర్ చేస్తుండటం టిడిపి నేతలకు రుచించటం లేదు.