బెజవాడను బెంబేలేత్తించిన బైక్ రేసర్లు అరెస్ట్... వదిలేసిన కోర్టు
బెజవాడను బెంబేలేత్తించిన బైక్ రేసర్లు అరెస్ట్... వదిలేసిన కోర్టు
కొద్దిరోజుల క్రితం బెజవాడలో స్థానికులను భయపెట్టిన బైనక్ రేసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్కు చెందిన నిఖిల్, మహేశ్, శివ, రఘురామ్, శ్రీనివాస్ ప్రవీణ్, రంజిత్గా గుర్తించారు. వీరు పలు కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు.. విజయవాడలోని అడ్వెంచరా క్లబ్ ఈ నెల 10 నిర్వహించిన బైక్ రేసింగ్కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వచ్చారు.
అదే రోజు రాత్రి అత్యాధునిక స్పోర్ట్స్ బైకులతో మితిమీరిన వేగంతో కృష్ణలంక జాతీయ రహదారిపై స్టంట్లు చేస్తూ.. రోడ్లపై చక్కర్లు కొట్టడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు బైక్ రేసింగ్పై ఫిర్యాదు చేశారు.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్ 336 ఆర్ / డబ్ల్యూ 34 కింద కేసు నమోదు చేశారు. అనంతరం బైక్ రేసింగ్కు పాల్పడింది ఎవరా అన్నది తేల్చే పనిలో పడ్డారు.
సీసీటీవీ ఫుటేజ్తో పాటు క్లబ్ యాజమాన్యం నుంచి సదరు యువకుల ఫోన్ నెంబర్లు సంపాదించి.. హైదరాబాద్ వెళ్లి బైక్ రేసింగ్ చేసిన యువకులందరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అయితే న్యాయస్ధానం వీరందరిని రిమాండ్కు తరలించేందుకు అంగీకరించలేదు.. ప్రముఖ బైక్లు తయారు చేసే కేటీఎం సంస్థ తమ ఉత్పత్తులను ప్రచారం చేసేందుకు ఈ ఈవెంట్ ప్లాన్ చేసిందని.. ఇందుకు గాను.. తాడేపల్లి పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలిసింది..
యువకులంతా బైక్ రేసింగ్లో పాల్గొనాలనే ఉత్సాహంతో పాటు నగదు బహుమతికి ఆశపడి పోటీల్లో పాల్గొన్నారని.. వీరి వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని.. యువకుల బంధువు ఒకరు తెలిపారు. రోడ్డుపై స్టంట్లు చేయడం తప్పని.. అందుకు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేయ్యాలని అంతేకాని కేసు నమోదు చేస్తే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.