చంద్రబాబు వణికిపోతున్నారు..
- వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర టీడీపీకి అంతిమయాత్ర కాబోతోందని జోస్యం చెప్పారు.
చంద్రబాబునాయుడు వణికిపోతున్నారా? ఎందుకు? వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనాల స్పందన చూసి చంద్రబాబు వణికిపోతున్నారట. అలాగని వైసిపి ప్రధానకార్యదర్శి, తిరుపతి మాజీ ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. సోమవారం జరిగిన ‘వాక్ విత్ జగన్’ కార్యక్రమంలో భూమన పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర టీడీపీకి అంతిమయాత్ర కాబోతోందని జోస్యం చెప్పారు. జగన్కు లభిస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వానికి అంతిమ గడియలు ప్రారంభం అయ్యాయని ధ్వజమెత్తారు.
అలాగే, జిల్లాలోని నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేటలోని వినాయక గుడి నుండి ఓంశక్తి ఆలయం వరకు ఆమె పాదయాత్ర చేశారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్రెడ్డి, తవణంపల్లిలో డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్యర్యంలో ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.